పేదలకు ఇంటి స్థలాలపై ఇంకా కుట్రలేనా?

రైతులనుంచి సేకరించిన పొలాల్లో అమరావతి రాజధాని అని ప్రకటించి.. వారికి గ్రాఫిక్స్ బొమ్మల మాయాజాలం చూపించి హడావుడిచేసిన చంద్రబాబునాయుడు.. తన హయాంలో ఒక్కటంటే ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. అక్కడి స్థలాల్లో కొంత…

రైతులనుంచి సేకరించిన పొలాల్లో అమరావతి రాజధాని అని ప్రకటించి.. వారికి గ్రాఫిక్స్ బొమ్మల మాయాజాలం చూపించి హడావుడిచేసిన చంద్రబాబునాయుడు.. తన హయాంలో ఒక్కటంటే ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారు. అక్కడి స్థలాల్లో కొంత భాగంలో నిరుపేదలకు ఇంటిస్థలాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. అక్కడినుంచి పచ్చదళం కుట్రలు మొదలయ్యాయి. నిరుపేదలకు ఇంటిస్థలాలు ఇవ్వడమే పాపం అన్నట్టుగా దానికి అడ్డుపడడం ప్రారంభించారు. 

రాజధాని రైతుల ముసుగులో ప్రభుత్వం పేదలకోసం చేపట్టే పనులను అడ్డుకునే అలవాటు ప్రకారం హైకోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ వారికి మొట్టికాయే ఎదురైంది. స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. అక్కడితో వారి కుట్రలు శాంతించలేదు. సుప్రీం కోర్టుకు వెళ్తున్నారు. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీచేయడాన్ని అడ్డుకోలేమని తెలిసిన వారు.. ఆమరణ దీక్షల పేరుతో కొత్త డ్రామాకు తెరతీస్తున్నారు. 

ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్ ను విచ్ఛిన్నం చేస్తున్నదంటూ అందుకు నిరసనగా కొలికపూడి శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదివరకు తిరుమలకు మహాపాదయాత్ర, అరసవిల్లి కి మహా పాదయాత్ర పేరుతో డ్రామాలను నడిపించిన కొలికపూడి శ్రీనివాసరావు ఈసారి ఓ ముందుజాగ్రత్త తీసుకోవడం విశేషం. 

తిరుపతి పాదయాత్ర సమయంలో పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల వారి ఆటలు సాగాయి గానీ, అరసవిల్లి కి వెళుతున్న సమయంలో పాదయాత్రలోని వారి ఆధార్ కార్డులను పోలీసులు అడగడంతో అసలు బండారం బయటపడింది. అమరావతి రైతుల ముసుగులో తెలుగుదేశం పెయిడ్ కూలీలు యాత్రలో ఉన్నట్టుగా తేలిపోయింది. దీంతో అమరావతి రాజధాని కోసం సంకల్పం తుస్సుమంది. అంతా డొల్లమాత్రమే అని తేలిపోయింది. అందుకే బహుశా ఈసారి కొలికపూడి శ్రీనివాసరావు తన కొత్త ఆమరణ నిరాహార దీక్ష అనే డ్రామాకు ‘రైతుల దీక్ష’ అనే ముసుగు తొడగడం లేదు. 

ప్రభుత్వం చర్యల పట్ల నిరసన తెలియజేయడం అవసరం అని తాను భావిస్తున్న వాళ్లందరూ తనతో కలిసి రావచ్చునని ఆయన ప్రకటించారు. అంటే ఎందరు పచ్చ పెయిడ్ కూలీలు అయినా సరే.. దీక్షలో వచ్చి కూర్చోవచ్చునని ఆయన అంతరంగంలాగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అమరావతి రైతుల పోరాటాల ముసుగు ఉద్యమాలకు ఫండింగ్ చేయడం తెలుగుదేశం నాయకులకు తలకుమించిన భారం అయిపోయింది. 

ఇక ఎన్నికలకోసం అందరూ డబ్బు జాగ్రత్త పెట్టుకుంటున్నారు. ఇలంటి సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుపడడానికి ఆయన తలపెట్టిన బూటకపు దీక్షకు ఎందరు అండగా నిలుస్తారన్నది కూడా సందేహమే.