ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొడుతున్న దెబ్బకు ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారు. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడాన్ని కొందరు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. సుమారు 49వేల మంది పేదలు ఇందులో లబ్ధిదారులు. ఇంత భారీగా గతంలో ఏ ముఖ్యమంత్రి విలువైన ఇంటి స్థలాన్ని ఇచ్చిన దాఖలాలు లేవు. భవిష్యత్లో కూడా రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు.
పేదలకు కనీస సదుపాయమైన గూడు కల్పించేందుకు సీఎం జగన్ సంకల్పంతో ముందుకెళుతుంటే, అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 15న ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 49 వేల మంది పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పేదలకు సాయం అందించడంలో చురుగ్గా పావులు కదుపుతోంది. మరోవైపు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వద్దన్న వారికి ఏపీ హైకోర్టు చీవాట్లు పెట్టినా, వారిలో మార్పు రాలేదు. ఎలాగైనా పేదలకు గూడు లేకుండా చేయాలనే పట్టుదలతోనే న్యాయపోరాటానికి దిగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఏపీ సర్కార్ మాత్రం రాజధాని ప్రాంతంలో లేఔట్లు వేసి, ఒక్కో సెంటు చొప్పున స్థలాల పంపిణీకి అధికారులను అక్కడే మోహరించింది. దీంతో ఇళ్ల పట్టాలు అందుకోనున్న లబ్ధిదారుల్లో ఆనందం వర్ణనాతీతం.
49 వేల మంది పేదలు రాజధాని ప్రాంతంలో ఉండకూడదని కోరుకునే వారికి అక్కడ ఎవరుండాలి? ఏం కావాలనేది అర్థం కాకుండా ఉంది. కనీసం మీ ఇళ్లలో పని చేయించుకోడానికైనా తమను దగ్గర పెట్టుకోవాలని పేదలు కోరుతున్నారు.
రాజధాని ప్రాంతంలో పేదలంతా ఇళ్లు కట్టుకుంటే, వారిని వ్యతిరేకిస్తున్న రియల్ ఎస్టేల్ వ్యాపారుల పరిస్థితి ఏంటో మరి! జగన్ తీసుకున్న చారిత్రక నిర్ణయంతో రాజధానిలో పేదలకు కూడా స్థానం దక్కింది.