మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధపడ్డారని ఆయన వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడం ద్వారా సంచలనం సృష్టించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వారు. ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీ వేదికగా పరస్పరం వ్యతిరేకంగా విద్యార్థి రాజకీయాలు నడిపారు. ఆ తర్వాత కూడా ఒకరంటే మరొకరికి అసలు పడదు. ఇటీవల పెద్దిరెడ్డిపై చంద్రబాబు పదేపదే విమర్శలు చేస్తున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దళిత వ్యతిరేకని, అందువల్లే సస్పెండ్ అయిన రామకృష్ణపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారంటూ విమర్శలు చేశారు. అలాగే పెద్దిరెడ్డి తమ్ముడు ద్వారకనా థరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న తంబళ్లపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలపై దాడి వివాదాస్పదమైంది.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తాను దళిత వ్యతిరేకినంటూ చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తన భయం పట్టుకుందని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబే దళిత వ్యతిరేకి అని పెద్దిరెడ్డి ఎదురుదాడి చేశారు.
అసలు తనకు సస్పెన్షన్ జడ్జి రామకృష్ణ ఎవరో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. తన సోదరుడి నియోకవర్గంలో టీడీపీ నాయకులు నల్లారి కిషోర్కుమార్రెడ్డి, శంకర్, శ్రీనివాసులరెడ్డిపై ఆ పార్టీ కార్యకర్తలే తిరగబడ్డారని ఘాటుగా విమర్శించారు.
చంద్రబాబు కూడా స్పందించి తాను చిత్తూరు జిల్లా నుంచి గెలవలేకపోతే రాజకీయ సన్యానం తీసుకుంటానని సవాల్ విసిరి గౌరవం నిలుపుకుంటారో లేక తోక ముడుస్తారో!