విష్ణుకుమార్ రాజు కోరుకున్న‌దే…బీజేపీ చేసింది!

బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణుకుమార్‌రాజు కోరుకున్న‌దే ఆ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చేసింది. బీజేపీలో విష్ణుకుమార్ రాజు ఉన్న‌ప్ప‌టికీ, మ‌న‌సంతా చంద్ర‌బాబే. బీజేపీ కోసం కాకుండా, చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం విష్ణుకుమార్ అనుక్ష‌ణం…

బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణుకుమార్‌రాజు కోరుకున్న‌దే ఆ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చేసింది. బీజేపీలో విష్ణుకుమార్ రాజు ఉన్న‌ప్ప‌టికీ, మ‌న‌సంతా చంద్ర‌బాబే. బీజేపీ కోసం కాకుండా, చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం విష్ణుకుమార్ అనుక్ష‌ణం ప‌ని చేస్తార‌న్న సంగ‌తి అంద‌రికీ తెలుసు. బీజేపీలో టీడీపీ మ‌నిషిగా ఆయ‌న కొంత కాలంగా మాట్లాడుతున్నారు. త‌న‌కు తానుగా బీజేపీ నుంచి వెళ్లిన‌ట్టు కాకుండా, సొంత పార్టీ నేత‌ల‌తో గెంటి వేయించుకుని, త‌ద్వారా సానుభూతి పొందాల‌నేది ఆయ‌న వ్యూహం.

టీడీపీ చాన‌ల్ ఎండీతో ఆయ‌న మ‌న‌సు విప్పి పంచుకున్నారు. ఎన్నిక‌ల సీజ‌న్ కావ‌డంతో ముసుగులు తొల‌గించే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. విష్ణుకుమార్‌రాజు కూడా అదే ప‌ని చేస్తున్నారు. ఇందుకు చంద్ర‌బాబు చాన‌ల్‌ని వేదిక‌గా వాడుకున్నారు. విష్ణుకుమార్‌రాజు మాత్ర‌మే కాదు, బీజేపీలోని టీడీపీ అనుకూల నేత‌లంతా ఆయ‌న‌తో గుండెవిప్పి పంచుకోవ‌డం వెనుక‌, టీడీపీ ప్ర‌యోజ‌నాలున్నాయ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం.

బీజేపీకి న‌ష్టం క‌లిగించేలా ఇంట‌ర్వ్యూలో అభిప్రాయాల్ని పంచుకోవ‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీటి కోస‌మే క‌దా విష్ణుకుమార్‌రాజు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న‌ది. పార్టీ నుంచి వెళ్లిపోయే మార్గం కోసం ఆయ‌న ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇంట‌ర్వ్యూ ప్లాన్ చేశార‌ని బీజేపీ భావిస్తోంది. 

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందమైంది బీజేపీ ప‌రిస్థితి. పార్టీలో మెజార్టీ నాయ‌కులంతా టీడీపీ అనుకూలురే. ఇప్పుడు విష్ణుకుమార్‌రాజు బ‌య‌ట ప‌డ్డారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి కూడా బీజేపీకి న‌ష్టం క‌లిగించేలా మాట్లాడారు.

ఆయ‌న‌కు మాత్రం షోకాజ్ నోటీసులు ఇవ్వ‌లేదు. షోకాజ్ నోటీసుల‌పై విష్ణుకుమార్ రాజు సంబ‌రాలు చేసుకుంటూ వుంటారు. బీజేపీ నుంచి బ‌య‌ట ప‌డి, ప‌నిలో ప‌నిగా జ‌గ‌న్‌పై సానుకూల ధోర‌ణితో కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే ఘాటు విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న ప్రిపేర్ అవుతుంటారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీని విమ‌ర్శించ‌డానికి కూడా ఆయ‌న వెనుకాడ‌రు. 

అంతా ప్లాన్ ప్ర‌కారం విష్ణుకుమార్ రాజు న‌డుచుకుంటుంటే, ఏమీ తెలియ‌ని అమాయ‌కుల్లా బీజేపీ క్ర‌మ‌శిక్ష‌ణ సంఘం నేత‌లు ఆయ‌న వివ‌ర‌ణ కోర‌డం విచిత్రంగా వుంది.