ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, అందునా.. చంద్రబాబు నాయుడు తనయుడతను. ప్రచారం అనేదే పరమావధి అని నమ్మే చంద్రబాబు నాయుడు, ఆయనకు అయిన వారు అయిన పచ్చమీడియా… ఇంత మంది అండ ఉన్నా.. ఇప్పటికీ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కాలేకపోతున్న నారా లోకేష్ , తనకు తానే పెద్ద పరీక్ష పెట్టుకుంటూ చేపట్టిన పాదయాత్ర ఆరంభమై చాలా కాలమే అయినా, ఇప్పటి వరకూ అదొకటి సాగుతోందనే ఉనికిని మాత్రం చాటుకోలేకపోతోంది.
మిగిలిన రాజకీయం అంతా పక్కన పెడితే.. నారా లోకేష్ పాదయాత్ర మాత్రం ఎవరికీ పట్టనిదిగా మారింది. చిత్తూరు జిల్లాతో మొదలైన ఈ పాదయాత్ర ఇప్పుడు ఎక్కడి వరకూ వచ్చిందో తెలుసుకోవడానికి గూగుల్ ను ఆశ్రయించినా కష్టమే అవుతోంది. ఒకటికి రెండు మూడు రకాల కీవర్డ్స్ వాడినా లోకేష్ పాదయాత్ర ఎక్కడ జరుగుతోందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. మరీ ఇలా సాగుతోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సాగుతున్నట్టుగా ఉంది నారా లోకేష్ యాత్ర!
అన్నింటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే.. లోకేష్ పాదయాత్ర గురించి ప్రచారం చేసిపెట్టడానికి పచ్చమీడియా కూడా తన తాపత్రయాన్నితగ్గించుకోవడం. లోకేష్ ను ఆది నుంచి పచ్చమీడియా తన భుజాల మీద మోస్తూనే ఉంది. లోకేష్ కు అపర జ్ఞానిగా చూపించడానికి చాలా కష్టాలే పడింది. అయితే, ఇప్పటి వరకూ ఆ కష్టాలన్నీ నిష్ఫలమే అయ్యాయి. పచ్చమీడియా దాదాపు పదేళ్ల నుంచి ఎంత గాలి కొట్టినా లోకేష్ పొలిటికల్ గ్రాఫ్ మాత్రం ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉంది.
చంద్రబాబు వారసుడిని మోయడం తమ బాధ్యతగా పచ్చమీడియా తీసుకుంది. అయితే.. అందుకు ప్రయోజనం శూన్యం. మహామహులు రాజ్యసభకు నామినేట్ అయితేనే.. అది దొడ్డిదారి అంటూ విమర్శించిన చంద్రబాబు నాయుడు తన తనయుడిని మాత్రం మహాజ్ఞానిగా ప్రొజెక్ట్ చేస్తూ పెద్దల సభకు పంపించి మరీ మంత్రిని చేసుకున్నాడు. అది లోకేష్ కెరీర్ కు మైనస్సే అయ్యింది కానీ ఉపయోగపడలేదు.
తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంత్రి అయ్యాడనే అపఖ్యాతి లోకేష్ ను ఎప్పటికీ వదలదు. అలా అడ్డదారిన అధికారాన్ని చెలాయించి లోకేష్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. మంత్రి పదివి పొందినా కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయాడు. మరి తన నడవడిక సరిగా లేదని లోకేష్ అప్పటికీ అర్థం చేసుకోలేదు. బహుశా ఇప్పటికీ ఆయనకు అది అర్థం కావడం లేదు.
తన పాదయాత్ర ప్రసంగాల్లో లోకేష్.. రాజకీయ ప్రత్యర్థులను సంబోధించే తీరే నప్పేలా లేదు. జగన్ ను పట్టుకుని వాడూ, వీడూ, అరేయ్, తురేయ్.. అంటూ లోకేష్ మాట్లాడుతూ తనేదో గొప్పగా సాధించినట్టుగా ఫీలవుతున్నాడు. జగన్ తో మొదలుపెడితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా లోకేష్ కు చులకనే! మరి ఈ అహంభావాన్ని చాటుకోవడం తప్ప ఇప్పటి వరకూ లోకేష్ తనను ఈ పాదయాత్రలో ప్రజలకు కొత్తగా పరిచయం చేసుకున్నది లేదు!
లోకేష్ పాదయాత్రకు మొదట్లో పచ్చమీడియా కూడా విపరీతమైన కవరేజీని ఇచ్చింది. అదిరిపోతోందనే భ్రమలనేవో కలిగించే ప్రయత్నం చేసింది. అయితే ఎక్కడా డ్రోన్ షాట్లు, పెద్ద ఎత్తున ప్రజలు కనిపించే ఫొటోలు చూపించలేదు. అన్నీ క్లోజప్ షాట్లు, ఐదారు మంది కనిపించే షాట్లు పెట్టి లోకేష్ పాదయాత్రకు విపరీతమైన ఫాలోయింగ్ అనే భ్రమలను కలిపించే ప్రయత్నాలేవో చేశారు. అయితే అవి తేడా కొట్టాయి.
గతంలో జగన్ పాదయాత్ర చేస్తే.. దాని గురించి పచ్చమీడియాతో సహా మెజారిటీ వర్గాలు చూపించకపోయినా.. అదంత సంచలనంగా నిలవడానికి కారణం సోషల్ మీడియా. జగన్ పాదయాత్రకు సంబంధించిన ఫొటోలు అలాంటి సంచననానికి ఆస్కారాన్ని ఇచ్చాయి.
జగన్ నడుస్తుండగా.. అటో కిలోమీటర్, ఇటో కిలోమీటర్ జనాలు కిక్కిరిసిన రోడ్లు, భారీ జనస్పందనకు దర్పణం పట్టాయి అప్పటి ఫొటోలు వీడియోలు. సుదూర ప్రాంతాన్ని కవర్ చేసే డ్రోన్ ఫొటో గ్రాఫులు, వీడియో గ్రాఫులు జగన్ పాదయాత్ర సూపర్ హిట్ కావడంలో అత్యంత కీలక పాత్ర పోషించాయి. వాటిని పచ్చమీడియా చూపకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వర్గాలు వాటిని దాచవచ్చు. అయితే సోషల్ మీడియాలో అవి హల్చల్ చేశాయి. అదరగొట్టాయి.
మరి లోకేష్ ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసేశారట! మరి ఇంతదూరం నడిస్తే.. అలాంటి పిక్స్ ఎన్ని హైలెట్ అయ్యాయి? ఇప్పటి వరకూ లోకేష్ పాదయాత్రలో బాగా జనాలు కనిపించింది బహుశా పెనుకొండ వద్ద. అటు పెనుకొండ, ఇటు పుట్టపర్తి, మరోవైపు హిందూపురం, ఇంకో వైపు ధర్మవరం.. ఇలా నాలుగు నియోజకవర్గాలు, తెలుగుదేశం పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉన్న ఆ నాలుగు నియోజకవర్గాల పరిధిలో మాత్రమే.. లోకేష్ పాదయాత్రకు చెప్పుకోదగిన జనస్పందన కనిపించింది.
నాలుగు నియోజకవర్గాల నేతలు కష్టపడితే ఒక్క చోట అందరినీ జమ చేస్తే అప్పుడు కాస్త కదలిక కనిపించింది. ఒక్కసారి అనంతపురం జిల్లా దాటేసి కర్నూలు జిల్లాలో పడ్డాకా లోకేష్ పాదయాత్ర మరింత పేలవంగా మారింది. ఇప్పుడు నంద్యాల సమీపంలో లోకేష్ యాత్రను పచ్చమీడియా కూడా పట్టించుకోవడం పూర్తిగా మానేసినట్టుగా ఉంది!