ఏపీ టీడీపీ ముఖ్య నేతలతో కలిసి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ పరిశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేయడం విశేషం. టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో కలిసి కేటీఆర్ పరిశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేయడం ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. టీడీపీలో గల్లా కుటుంబానికి ప్రత్యేక స్థానం వుంది. ఆర్థికంగా బలమైన గల్లా కుటుంబానికి చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ సభ్యునిగా గల్లా జయదేవ్ టీడీపీ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వరుసగా రెండోసారి ఆయన గెలుపొందడం విశేషం. గల్లా జయదేవ్ మాతృమూర్తి అరుణకుమారి చంద్రగిరి నుంచి తిరుగులేని నాయకురాలిగా నిరూపించుకున్నారు.
చంద్రబాబు పుట్టిపెరిగిన నియోజకవర్గమైన చంద్రగిరిలో ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున అరుణకుమారి సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగారు. చంద్రగిరిలో 2014 వరకూ అరుణకుమారిదే పైచేయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. టీడీపీలో గల్లా అరుణకుమారి కుటుంబం చేరింది. చంద్రగిరి నుంచి పోటీ చేసి ఆమె ఓడిపోయారు. కానీ గుంటూరు లోక్సభ స్థానం నుంచి అరుణకుమారి తనయుడు జయదేవ్ గెలుపొంది, తమ సత్తా చాటారు.
ఇదిలా వుండగా మహబూబ్నగర్లోని దివిటిపల్లి వద్ద 270 ఎకరాల్లో అమరరాజా లిథియం బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు నిమిత్తం ఇవాళ గల్లా అరుణ, జయదేవ్తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయడం విశేషం. ఏపీలో అమరరాజా పరిశ్రమలో కాలుష్యం, అనంతరం ప్రభుత్వ చర్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తెలంగాణలో అమరరాజా పరిశ్రమ స్థాపించడం వెనుక ఏపీ ప్రభుత్వ వేధింపులే కారణమని టీడీపీ భారీగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.