ఎన్టీఆర్ తనయుడు, టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఏం చేసినా … ఆహా, ఓహో అనే అభిమానులున్నారు. ఇటీవల కాలంలో జై బాలయ్య జైజై బాలయ్య అంటూ కొత్త నినాదం అందుకున్నారు. బాలయ్యపై అభిమానులు ప్రేమ పంచితే, ఆయన గారు మాత్రం కోపాన్ని ప్రదర్శించడం ఎక్కువగా చూస్తుంటాం. నచ్చిన వాళ్లు తిట్టినా, కొట్టినా బాగుంటుందని సరిపెట్టుకోవడం తప్ప, బాలయ్య వ్యవహార శైలిపై ఏమీ చేయలేమనే కామెంట్స్ వస్తుంటాయి.
అప్పుడప్పుడు బాలయ్య గాయకుడి అవతారం ఎత్తుతుంటారు. తాజాగా ఆయన నోట ప్రసిద్ధ గాయకుడు ఘంటసాల ఆలపించిన అద్భుత పాట జాలువారడం విశేషం. ఖతార్ రాజధాని నగరం దోహాలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి బాలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్యలో గాయకుడు ఆవహించడం గమనార్హం.
ఎన్టీఆర్ నటించిన “జగదేకవీరుని కథ” సినిమాలోని 'శివశంకరి' అనే ప్రసిద్ధ పాటను బాలయ్య ఆలపించడం విశేషం. పాట పాడుతున్న సందర్భంలో బాలయ్యకు బ్యాగ్రౌండ్లో మంటలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
బాలయ్య ఆలాపనకు తగ్గట్టుగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటాయి. బాలయ్య స్వరానికి ప్రశంసలు అన్నట్టుగా అభిమానుల కేరింతలు సరేసరి. అభిమాన హీరో ఏం చేసినా నచ్చుతుందనేందుకు బాలయ్య తాజా గేయాలాపనే నిదర్శనం.