ప్రపంచంలో అతి పెద్ద వెంకన్న విగ్రహం…?

ప్రపంచంలోనే అతి పెద్దది అయిన తిరుపతి వెంకన్న స్వామి వారి విగ్రహం విశాఖలో ఏర్పాటు కాబోతోంది. దీనికి టీటీడీ పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది. ఇక ఈ విగ్రహం ఏర్పాటుతో విశాఖ ఆధ్యాత్మికపరంగా చరిత్ర…

ప్రపంచంలోనే అతి పెద్దది అయిన తిరుపతి వెంకన్న స్వామి వారి విగ్రహం విశాఖలో ఏర్పాటు కాబోతోంది. దీనికి టీటీడీ పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది. ఇక ఈ విగ్రహం ఏర్పాటుతో విశాఖ ఆధ్యాత్మికపరంగా చరిత్ర సృష్టించే అవకాశాలు ఉంటాయి.

తిరుమల తిరుపతి వెంకన్న అఖిలాండ బ్రహ్మాండనాయకుడు. ఆయన దర్శనం కోసం ఎక్కడెక్కడి వారు తిరుపతి వెళ్లి దర్శించుకుంటారు. ఆ స్వామిని 125 అడుగుల ఎత్తులో చూసి ఆనందించే భాగ్యం విశాఖ వాసులకు కలగబోతోంది. అంతే కాదు విశాఖకు ఇక మీదట వెంకన్న స్వామి కోసమే వచ్చి పర్యాటకులకు కూడా ఈ భారీ విగ్రహం కనువిందు చేయనుంది.

దీనికి సంబంధించి శ్రీ వెంకటేశ్వరస్వామి ట్రస్ట్ స్వామి వారి నిలువెత్తు విగ్రహాన్ని స్థాపించేందుకు ముందుకు వచ్చింది. ఈ ట్రస్ట్ అధినేత రామక్రిష్ణం రాజు అతి పెద్ద వెంకన్న స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న తన కోరికను ఇలా తీర్చుకుంటున్నారు. ఆయన దీని మీద టీటీడీ ట్రస్ట్ ని ఇప్పటికే సంప్రదించారు. స్వామి వారి విగ్రహ ఏర్పాటుకు అనుమతించాలని, సహకరించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఆయన లేఖ రాశారు.

దానికి వైవీ సుబ్బారెడ్డి అంగీకరించడమే కాకుండా టీటీడీ తన వంతుగా పూర్తి సాయం చేస్తుందని కూడా పేర్కొన్నారు. ఇక విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ఈ విషయమై టీటీడీ లేఖ రాసింది. మూడు ఎకరాల సువిశాల స్థలం 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు ఉచితంగా ఇవ్వాలని టీటీడీ కోరింది.

భారీ ఖర్చుతో ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహంతో పాటు ఆ సమీపాన స్వామి వారి ఆలయాన్ని కూడా సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం భీమిలీ దగ్గర కాపులుప్పాడలో అనువైన స్థలాన్ని గుర్తించారు. ఇక ప్రపంచంలో ఇప్పటిదాకా అతి పెద్ద వెంకన్న స్వామి వారి విగ్రహం 108 అడుగుల ఎత్తున నిర్మించినది మారిషస్ లో ఉంది. ఇపుడు దాన్ని మించి విశాఖలో ఏర్పాటు కానుంది. మొత్తానికి చూస్తే విశాఖ ఇపుడు అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది అన్న మాట.