విశాఖలో రాజకీయ భూకంపం రావడానికి కచ్చితంగా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. వచ్చే వారం చివరలో సిట్ పూర్తి నివేదిక వైసీపీ సర్కార్ చేతికి చేరుతుంది.
ఈ మేరకు సిట్ అధిపతిగా ఉన్న విజయకుమార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే వారం చివరి రోజుకు ప్రభుత్వం ముందు విశాఖ భూ కుంభకోణాలపైన సిట్ చేసిన దర్యాప్తు నివేదిక ఉంటుందని ఆయన తాజాగా ప్రకటించారు.
అందులో అన్ని అంశాలు కూలంకషంగా చర్చించారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిట్ దర్యాప్తు దాదాపుగా ఏడాదిగా సాగింది. ఈ విచారణ తరతమ భేదం లేకుండా నిష్పాక్షికంగా సాగిందని అంటున్నారు.
గత ప్రభుత్వంలో భూములను ఆక్రమించుకున్న రాజకీయ పెద్దల జాతకాలు అన్నీ కూడా సిట్ తన నివేదికలో అక్షరం పొల్లు పోకుండా పొందుపరచినట్లుగా చెబుతున్నారు.
అదే కనుక నిజం అయితే మాత్రం విశాఖలో భారీ ఎత్తున రాజకీయ భూకంపం పుట్టడం ఖాయమని అంటున్నారు. అసలే శీతాకాలం, చలి బాగా ఉన్న వేళలో సిట్ నివేదిక గుట్టు బయటపెడితే ఆ వేడి వేసవిని తలపించేదే అని అంచనా వేస్తున్నారు.
మొత్తానికి బిగ్ షాట్స్ చాలా మంది సిట్ నివేదికలో ఉంటారు అన్న వార్తలతో అపుడే వైజాగ్ పెద్దల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట.