విమర్శలు చేయడం తప్పు కాదు. కానీ అందులో విజ్ఞత కనబరచాలి. అది కొరవడితే ఆ మనిషి మానసిక స్థితిలో ఏదో తేడా కొడుతున్నట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్లు బయట సమాజంలో ఉండడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఇటీవల ఏపీ శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును ఉద్దేశించి హైదరాబాద్ ఎర్రగడ్డలో చూపించుకోండి అని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా భారత్ బంద్పై చేసిన ట్వీట్ చూస్తే… ఇక ఎంత మాత్రం ఆమె బయట ఉండాల్సిన మనిషి కాదని, ఏ మానసిక ఆస్పత్రిలోనో తక్షణం చేర్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. రైతంటే మానవాళి ఆకలి తీర్చే అద్భుతమైన మనిషి.
రైతుని అవమానించడం అంటే మన తల్లిని, మనల్ని మనం హేళన చేసుకోవడమే. రైతుని పట్టించుకోకపోయినా ఎవరూ ఏమీ అనరు. కానీ ఒక పార్టీ లేదా పాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ల పోరాటాన్ని చులకన చేసి మాట్లాడితే మాత్రం సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ విషయంలో కూడా అలాంటి వ్యతిరేకతే వస్తోంది.
కంగనా రనౌత్ తనకు తాను ఏమనుకుంటున్నారో తెలియదు కానీ, ఆమె ట్వీట్ మాత్రం అభ్యంతరకరంగా ఉంది. ‘రండి భారత్ను బంద్ చేసేద్దాం. ఈ పడవకు తుఫాన్ల కొరత లేనట్లు ఇప్పుడు మీరొచ్చి గొడ్డలితో పడవకు రంధ్రాలు చేయండి’ అంటూ భారత్ బంద్ నిర్వాహకులను కించపరిచేలా ఆమె ట్వీట్ చేశారు. అంతటితో ఆమె ఆగలేదు.
ఇప్పటికే దేశం అట్టుడుకుతోందని, బంద్తో మరింత తీవ్రతరం చేస్తున్నారంటూ విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా రైతులు చేస్తున్న పోరాటాలను కూడా కంగనా మిగిలిన పోరాటాలతో జత కట్టి అవహేళన చేయడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మంచీచెడులతో సంబంధం లేకుండా మోడీ సర్కార్ను వెనకేసుకుని రావడం తన కర్తవ్యంగా గత కొంత కాలంగా కంగనా ఓ పథకం ప్రకారం సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళనల గురించి ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ గతంలో మాట్లాడిన ఓ వీడియోను ఈ ట్వీట్కు జత చేశారు.
రైతులది చావు బతుకుల పోరాటం. పంటలు పండించడమే కాదు, పోరాటాలను కూడా తాము పండించగలమని ఢిల్లీ వేదికగా ఉద్యమిస్తున్న రైతులు నిరూపించారు. అందుకే రైతుల ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తుతోంది.
నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలవాలన్న ఛీప్ పబ్లిసిటీ పిచ్చితో కంగనా ఈ దఫా రైతుల్ని టార్గెట్ చేసి అభాసుపాలవుతున్నారు. రైతులతో పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటమాడడమే అని కంగనా గుర్తిస్తే మంచిది.
కంగనా ట్వీట్పై పంజాబీ సింగర్లు దుల్జిత్, మికా సింగ్ ధ్వజమెత్తారు. తమతో పెట్టుకోవద్దు అని మికాసింగ్ ఆమెను హెచ్చరించాడు. రైతుల ఉద్యమంపై ఇక మీదట కంగనా ఇలాంటి చిల్లర ట్వీట్స్ చేస్తే మాత్రం ఏ పిచ్చాస్పత్రిలోనో చేర్చే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.