కాపు నాయకుడు, మంత్రి అంబటి రాంబాబు తన సామాజికం వర్గం జనసేనాని పవన్కల్యాణ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్కల్యాణ్పై విరుచుకుపడ్డారు. తుని రైలు దుర్ఘటనలో కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా తదితర నేతలపై కేసు కొట్టి వేయడాన్ని హర్షిస్తున్నామన్నారు.
టీడీపీ అధికారంలో వుంటే కాపులను హింసించడం, ద్వేషించడం ఆనవాయితీ అని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కాపుల ద్రోహి పార్టీగా వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే కాపు నాయకుడు వంగవీటి మోహన్రంగారావును చంపినట్టు సాక్ష్యాత్తు అప్పటి టీడీపీ నాయకుడు హరిరామజోగయ్య చెప్పారని గుర్తు చేశారు.
కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని నిలబెట్టుకోలేకపోతే నిరాహార దీక్ష చేస్తానని ముద్రగడ పద్మనాభం హెచ్చరించారన్నారు. అయితే ఆయన్ను దీక్ష చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం హింసించిందన్నారు. కాపు జాతిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న పార్టీ టీడీపీ అని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. టీడీపీ కాపుల వ్యతిరేక పార్టీగా ఆయన అభివర్ణించారు. చరిత్ర తెలియని కొందరు చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని బయల్దేరుతున్నారని పరోక్షంగా పవన్కల్యాణ్పై విమర్శలు గుప్పించారు.
పవన్కు చరిత్రే తెలియదన్నారు. పవన్ ఓ అజ్ఞాని అని మండిపడ్డారు. కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం గర్జిస్తున్నప్పుడు పవన్ ఇంట్లో పడుకున్నారని దెప్పి పొడిచారు. ఇప్పుడు కాపులందరితో చంద్రబాబు పల్లకీ మోయించడానికి ప్రయత్నిస్తున్నారని తప్పు పట్టారు. కాపులను అమ్మాలని అనుకుంటున్న పవన్కల్యాణ్ విషయంలో అంతా అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు.
కాపుల విషయంలో చంద్రబాబు సైకోలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్కల్యాణ్ ఒకరి ఇళ్లకు వెళ్లిరావచ్చన్నారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే తమను హింసించిన కాపులు ఎట్టి పరిస్థితుల్లో కలవరని త్వరలో క్షేత్రస్థాయిలో తేలిపోతుందని స్పష్టం చేశారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి తమ వ్యతిరేక పార్టీగా వ్యవహరిస్తున్న విషయం ప్రతి కాపు సోదరుడికి తెలుసన్నారు. ఆ భావన కాపుల గుండెల్లో వుందన్నారు.
అయితే ఆ అభిప్రాయాన్ని చెరిపేసి ప్యాకేజీ కొట్టేసి, డబ్బు కొట్టేసి సినిమా అమ్మేసినట్టుగా కాపులను చంద్రబాబుకు అమ్మాలనే పవన్ ప్రయత్నాలు వారంతా కనిపెట్టుకుని వుండాలని అంబటి రాంబాబు హెచ్చరించారు. ఒక పార్టీలో వుండి వేరే పార్టీ వారితో కలవడం పవన్కు అలవాటే అని విమర్శించారు.