దుబ్బాక అసెంబ్లీ ఎన్నిక లీగ్ మ్యాచ్ లాంటిది అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికలు సెమిస్ లాంటివి, ఈ నేపథ్యంలో.. నాగార్జునసాగర్ బై పోల్ ఫైనల్ మ్యాచ్ లాంటిది! వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అనే టోర్నీకి క్వాలిఫయింగ్ మ్యాచ్ ల్లా జరుగుతున్నాయి ఈ ఎన్నికలన్నీ! ఈ క్వాలిఫయింగ్ టోర్నీల్లో విజయం సాధించే వారు.. అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి తమ బెర్త్ లను బుక్ చేసుకుంటున్నట్టే!
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన బెర్త్ ను సంపాదించినట్టే. ఇన్నాళ్లూ అండర్ డాగ్ గా నిలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో తను అసోసియేట్ జట్టు కాదని, అసలు ప్రత్యర్థినే అని క్లారిటీ ఇచ్చింది.
అయితే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలు ఒకలా జరిగాయి, గ్రేటర్ లో ఎంఐఎం బూచి బీజేపీకి బాగా ఉపకరించింది. తమ ప్రత్యర్థి టీఆర్ఎస్ కాదు ఎంఐఎం మాత్రమే అని బీజేపీ ఒకటికి వంద సార్లు చెప్పి హిందుత్వ ఓట్లను సమీకరించుకోగలిగింది. అయితే.. నాగార్జున సాగర్ పూర్తిగా డిఫరెంట్! ఒకప్పటి కాంగ్రెస్ నియోజకవర్గం ఇది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు కూడా నాగార్జున సాగర్ సత్తాకు పరీక్షగా నిలవబోతోంది. టీఆర్ఎస్ పై వ్యతిరేకత స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. సత్తా ఉంటే దాన్ని క్యాష్ చేసుకోవచ్చని బీజేపీ నిరూపించింది. మరి తనుకు అనుకూలమైన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గట్టిగా పని చేసుకుంటే తను కూడా అసెంబ్లీ ఎన్నికల నాటికి పోటీలో ఉన్నట్టుగా నిరూపించుకోవచ్చు.
అలా కాకుండా ఈ బై పోల్ లో కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గా పోరాటం మారితే.. తెలంగాణ రాజకీయంలో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడ్డట్టే. అసెంబ్లీ ఎన్నికల నాటికి తాము ఎవరిని టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కోరుకుంటున్నట్టో తెలంగాణ ప్రజలు ఈ బై పోల్ తో మరింత స్పష్టతను ఇవ్వనున్నారు.
ఒకవేళ తన అన్ని అస్త్రాలనూ ఉపయోగించి టీఆర్ఎస్ ఈ బై పోల్ లో భారీ మెజారిటీతో నెగ్గితే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో నెగ్గినవే అవుతాయి!