కర్నాటకలోని ఉడిపి కళాశాలలో మొదలైన హిజాజ్ వివాదం నెమ్మదిగా అగ్గిరాజేస్తోంది. ఆ వివాదం హింసాత్మకమవుతోంది. విద్యాసంస్థలు కాస్త మత విద్వేష నినాదాలతో మార్మోగడం ఆందోళన కలిగిస్తోంది.
కర్నాటకలో పరిస్థితులు అదుపు తప్పుతుండడంతో విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవులు కూడా ప్రకటించారు. మరోవైపు హిజాజ్పై పలువురు సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమవైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి వివాదాన్ని మరింతగా పెద్దది చేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్పై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ప్రియాంక గాంధీ ఏమన్నారంటే…
“బికినీ, జీన్స్ లేదా హిజాజ్ …ఏం వేసుకోవాలో నిర్ణయించుకోవడం మహిళల హక్కు. ఈ హక్కును భారత రాజ్యాంగం మహిళలకు ఇచ్చింది. వారిని వేధించడం ఆపండి” అని ప్రియాంక గాంధీ వాద్రా చెంప ఛెళ్లుమనిపించే ట్వీట్ చేశారు. ఈ ట్వీట్పై బీజేపీ, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ వాదులు ఎదురు దాడికి దిగారు.
ఇప్పుడు జరుగుతున్న వివాదం ఏంటి? ఇందులోకి బికీనీ, జీన్స్ అంశాలు ఎందుకు తెరపైకి వచ్చాయంటూ ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. రాజ్యాంగం, స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటడాన్ని సమర్థిస్తారా అంటూ ప్రియాంక గాంధీని నిలదీస్తున్నారు. హిజాజ్ను వ్యతిరేకిస్తున్న వాళ్లు భారతీయ సంప్రదాయ ప్రకారం వస్త్రధారణ ఎందుకు చేయలేదని లౌకికవాదులు కౌంటర్ ఇస్తున్నారు.