మార్గదర్శి వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీరెడ్డితో డిబేట్కు సిద్ధమని …మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ తన స్థాయిని తగ్గించుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉండవల్లి రాజకీయ అనుభవమంత వయసు కూడా జీవీరెడ్డికి లేదు. పైగా జీవీరెడ్డి ఎల్లో చానళ్లలో కూచుని నిత్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలపై నోటికొచ్చినట్టు వాగుతుంటారు. అంత మాత్రాన జీవీరెడ్డిని పెద్ద మేధావిగా ఉండవల్లి భ్రమించారా? అనే అనుమానం కలుగుతోంది.
జీవీరెడ్డి సీఏతో పాటు లా కూడా చదివారు. నిత్యం వైసీపీ సర్కార్ అప్పులపై ఆయన విమర్శలు చేస్తుంటారు. జగన్ సర్కార్ భారీ మొత్తంలో అప్పులు చేసిందని, ఇక బండి ముందుకు నడవదంటూ తాను భ్రమల్లో వుండడంతో పాటు ఏపీ ప్రజానీకాన్ని కూడా వాటిల్లో నింపేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు.
టీడీపీ అనుకూల చానళ్లలో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు, మరీ ముఖ్యంగా యాంకర్లకు శ్రవణానందం కలిగించేలా జీవీరెడ్డి మాట్లాడుతుంటారు. అందుకే ఆ చానళ్లకు జీవీరెడ్డి ఇష్టుడైన నాయకుడయ్యారు. టీవీ చానళ్ల పరిస్థితి ఎలా తయారైందంటే… వైఎస్ జగన్ను, వైసీపీ నేతల్ని విమర్శిస్తే చాలు, వాళ్లంతా రాత్రికి రాత్రే జాతీయ, అంతర్జాతీయ, అంతరిక్ష మేధావులవుతారు. అలాంటి శతకోటి లింగాల్లో బోడి లింగం అనే సామెత చందాన జీవీరెడ్డి కూడా ఒకడని ఉండవల్లి ఎందుకు భావించలేదో అర్థం కావడం లేదు.
37 ఏళ్ల జీవీరెడ్డికి ఆర్థిక, రాజకీయ అంశాలపై అవగాహన వుంది. కాంగ్రెస్ నుంచి ఏడాది క్రితం టీడీపీలో చేరారు. చాలా తక్కువ సమయంలోనే చంద్రబాబు, లోకేశ్కు దగ్గరయ్యారు. ఉండవల్లి అరుణ్కుమార్ సవాల్ను రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు జీవీరెడ్డి ఆసక్తి కనబరుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉండవల్లితో డిబేట్ అంటే పచ్చ చానళ్లలో ఇష్టానురీతిలో మాట్లాడ్డం కాదని త్వరలో జీవీరెడ్డికి తెలిసొస్తుంది.
ఉండవల్లితో డిబేట్ అంటే హనుమంతుని ముందు కుప్పిగంతలు వేసిన చందంగా…జీవీరెడ్డి ఎగిరెగిరి పడుతున్నారు. ఈ ఎగురుడు ఎక్కువైతే కాళ్లు, చేతులు విరగడం తప్ప, మరొక ప్రయోజనం వుండదని జీవీరెడ్డి గ్రహించాల్సి వుంది.
అయితే జీవీరెడ్డితో ఉండవల్లి డిబేట్కు ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి అయినంత మాత్రాన జీవీరెడ్డికి తనతో చర్చించేంత స్థాయి వుంటుందని ఉండవల్లి ఎలా అనుకున్నారో అనే టాక్ వినిపిస్తోంది. ఉండవల్లికి సమాజంలో ఓ గౌరవం, గుర్తింపు వున్నాయి. అందుకే ఉండవల్లి మాట్లాడారంటే దానికో విలువ. రామోజీని ఆర్థికంగా అత్యంత బలహీనమైన ఉండవల్లి ఢీకొట్టగలిగారంటే, అదంతా ఆయన క్యారెక్టర్, లీడర్షిప్కు ఉన్న గొప్పతనం. ఏది ఏమైనా ఉండవల్లి తనకు సమాన స్థాయి కలిగిన నాయకుడితో చర్చకు సిద్ధమై వుంటే బాగుండేది.