బాబుకు అధికారం…ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ గోవిందా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడికి అధికారం ఇస్తే…ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముస్లింల‌కు చావు దెబ్బ త‌గ‌ల‌నుందా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మోదీ స‌ర్కార్‌కు భ‌య‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముస్లింల రిజ‌ర్వేష‌న్ ఎత్తి వేయ‌డానికి కూడా వెనుకాడ‌ర‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. తాజాగా…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడికి అధికారం ఇస్తే…ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముస్లింల‌కు చావు దెబ్బ త‌గ‌ల‌నుందా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మోదీ స‌ర్కార్‌కు భ‌య‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముస్లింల రిజ‌ర్వేష‌న్ ఎత్తి వేయ‌డానికి కూడా వెనుకాడ‌ర‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. తాజాగా ఓ జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోదీ విధానాల‌కు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డ‌మే ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్ ఎత్తివేస్తార‌నేందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు.

జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చంద్ర‌బాబు ఏమ‌న్నారు, ముస్లింల భ‌యానికి కార‌ణాలేంటో తెలుసుకుందాం.

“ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను, అమ‌లు చేస్తున్న విధానాల‌ను నేను పూర్తిగా స‌మ‌ర్థిస్తున్నా. ప్ర‌ధాని ప్ర‌తిపాదిస్తున్న విజ‌న్ 2047తో సంపూర్ణంగా ఏకీభ‌విస్తున్నా”

అలాగే ఎన్డీఏ కూట‌మిలో చేరేందుకు వ్య‌తిరేకం కాదు క‌దా అనే ప్ర‌శ్న‌కు కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏపీలో అధికారంలోకి వ‌స్తే త‌మ రిజ‌ర్వేష‌న్ ఎత్తివేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తార‌నే చ‌ర్చ మొద‌లైంది. ఇటీవ‌ల తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా ముస్లింల రిజ‌ర్వేష‌న్‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో బీజేపీకి అధికారం ఇస్తే… ముస్లింల నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

మోదీ విధానాల‌ను అమిత్‌షా మాట‌లు ప్ర‌తిబింబించాయి. ఎన్‌డీఏ కూట‌మిలో చేర‌డంపై చంద్ర‌బాబు న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఎన్‌డీఏలో చేరిక‌ను ఆయ‌న కొట్టి పార‌య‌లేదు. అంటే రానున్న రోజుల్లో ఎన్‌డీఏలో చేరాల‌ని చంద్ర‌బాబు ఉత్సాహం చూపుతున్నార‌ని ఆయ‌న దాట‌వేత ధోర‌ణి మాట‌లే చెబుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబును ఇంట‌ర్వ్యూ చేసిన చాన‌ల్ బీజేపీకి తొత్తు. ఈ చాన‌ల్ ఇంట‌ర్వ్యూలో మోదీ విధానాల‌ను పూర్తిగా స‌మ‌ర్థిస్తున్నాన‌ని చెప్ప‌డం ద్వారా… ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు అనుకూల‌మ‌ని, అలాగే క‌ర్నాట‌లో ఇప్ప‌టికే బీజేపీ స‌ర్కార్ ముస్లింల రిజ‌ర్వేష‌న్‌ను ర‌ద్దు చేసిన‌ట్టు, ఏపీలో కూడా అలాంటి నిర్ణ‌యాన్నే తీసుకుంటాన‌నే సంకేతాల్ని టీడీపీ అధినేత పంపార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇదంతా మోదీ స‌ర్కార్ ప్రాప‌కం కోసం చంద్ర‌బాబు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ముస్లింల‌కు నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాజ‌కీయంగా ముస్లింలు వైఎస్సార్ త‌న‌యుడికి అండ‌గా ఉన్నార‌ని, త‌న‌కు పెద్ద‌గా ఉప‌యోగం లేద‌నే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఎవ‌రినైనా బ‌లిపెట్టేందుకు చంద్ర‌బాబు బ‌లిపెడ‌తార‌నే ప్ర‌చారం చాలా కాలం నుంచి వుంది.

ఇదే విష‌యాన్ని బాబుకు పిల్ల‌నిచ్చిన మామ దివంగ‌త ఎన్టీఆర్ చెప్పారు కూడా. రాజ‌కీయంగా త‌న‌ను కాపాడుకునేందుకు ఏకంగా న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల్ని బీజేపీలోకి పంపిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే అనే విమ‌ర్శ ఉంది. రానున్న రోజుల్లో ముస్లింల రిజ‌ర్వేష‌న్‌ను ఎత్తివేయ‌డానికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకోడానికి కూడా చంద్ర‌బాబు వెనుకాడ‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయం బ‌లంగా వుంది. రానున్న రోజుల్లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే మాత్రం… త‌మ రిజ‌ర్వేష‌న్ ర‌ద్దు కావడం ఖాయ‌మ‌నే ఆందోళ‌న ముస్లింల‌లో వుంది. ముస్లింల రిజ‌ర్వేష‌న్‌పై కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.