తన సినిమాకు సీక్వెల్ ప్రకటించిన సాయితేజ్

విరూపాక్ష ఇలా హిట్టవ్వడమే ఆలస్యం, వెంటనే దానికి సీక్వెల్ ప్రకటించాడు హీరో సాయితేజ్. విరూపాక్ష పార్ట్-2 త్వరలోనే వస్తుందని ప్రకటించాడు. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో, ఈరోజు ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు…

విరూపాక్ష ఇలా హిట్టవ్వడమే ఆలస్యం, వెంటనే దానికి సీక్వెల్ ప్రకటించాడు హీరో సాయితేజ్. విరూపాక్ష పార్ట్-2 త్వరలోనే వస్తుందని ప్రకటించాడు. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో, ఈరోజు ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చట్లు పెట్టాడు సాయితేజ్. ఈ సందర్భంగా విరూపాక్ష-2 వస్తుందనే విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు.

ఛాటింగ్ లో భాగంగా ఫ్యాన్స్ అడిగిన కొన్ని సందేహాలకు సమాధానాలు కూడా ఇచ్చాడు. సినిమాలో రాజీవ్ కనకాల పాత్రను ఎందుకు చంపలేదనే ప్రశ్నకు, ఇంకా ఉంది అంటూ సమాధానమిచ్చాడు. ఇక సినిమా చివర్లో కంటిచూపుతో తను చూపించిన వేరియేషన్ పై రియాక్ట్ అవుతూ.. కథ ఇంకా ఉందని, త్వరలోనే మరిన్ని విషయాలు చెబుతామంటూ ప్రకటించాడు.

విరూపాక్ష సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో, ట్విట్టర్ ఛాటింగ్ లో తన ఆనందం, ఉత్సాహం మొత్తం చూపించాడు. చాలా ప్రశ్నలకు ఎమోజీలతో, మరికొన్ని ప్రశ్నలకు సెటైర్లతో సమాధానాలిచ్చాడు.

పవన్ కల్యాణ్ తో చేస్తున్న సినిమాకు ఏ టైటిల్ పెట్టారనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఆ టైటిల్ ఇప్పుడే చెప్పేస్తే, రాత్రికి 'తేజ్ గారు' అంటూ తనకు ఫోన్ వస్తుందని, పవన్ పై సెటైర్ వేశాడు. ఇక చిరంజీవితో సినిమాపై స్పందిస్తూ.. చిరంజీవి ఎప్పుడు కబురుపెడితే అప్పుడు ఆయనతో సినిమా చేసేందుకు సర్వం సిద్ధమని ప్రకటించాడు.