గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 381. బహుశా గత కొన్ని నెలల్లోనే ఇది అతి తక్కువ నంబర్. జూన్ నెల నుంచి కరోనా కేసుల నంబర్లు విపరీత స్థాయిలో పెరిగిన రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. మొదటి నుంచి కరోనా పరీక్షలను అధికంగా చేస్తున్న రాష్ట్రం అయిన ఏపీ లో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా అలానే పెరిగింది. ఒక దశలో రోజుకు పది వేల స్థాయిలో కేసులు పెరిగాయి. కొన్ని జిల్లాల్లో రోజుకు వెయ్యి చొప్పున కేసుల సంఖ్య నమోదైంది.
అయితే ఆ పరిస్థితుల నుంచి క్రమంగా మార్పు చోటు చేసుకుంది. ప్రజలు కరోనాను లైట్ తీసుకుని సాగుతున్నా.. నంబర్లలో మాత్రం తగ్గుదల నమోదవుతూ వస్తోంది. ఈ క్రమంతో ఏపీలో ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య 400లోపుకు చేరడం గమనార్హం. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ ఇరవై నాలుగు గంటల్లో కూడా 40 వేలకు పైగా శాంపిల్స్ ను పరీక్షించారు.
40 వేలకు పైగా కరోనా టెస్టులు జరగ్గా పాజిటివ్ కేసుల సంఖ్య 400లోపు ఉండటం గమనార్హం. అనుమానిత కేసులకు, కాంటాక్ట్ కేసులకే టెస్టులు జరిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా పాజిటివిటీ రేటు చాలా చాలా తక్కువ స్థాయిలో నమోదు కావడం ఊరటను ఇచ్చే అంశం.
ఇలా ఒక దశలో రోజుకు వెయ్యి కేసులు నమోదైన జిల్లాల్లో ఇప్పుడు 20, 30 స్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రజలు తమ యాక్టివిటీస్ లో నిమగ్నం అయ్యారు. రోజువారీ కార్యకలాపాలు యథాతథ స్థితికి వచ్చాయి. పనులు, ప్రయాణాలు సాఫీగానే సాగుతున్నాయి.
కొంత వరకూ జాగ్రత్త చర్యలను పాటిస్తున్నారు. మరి కొందరు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. అయినప్పటికీ రోజువారీ కేసుల సంఖ్యలో తగ్గుదల చోటు చేసుకొంటూ ఉండటం ఆశ్చర్యకరమే అయినా ఇది ఆహ్వానించదగిన అంశం.
ఇలా ఏపీలో అయితే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. కానీ.. ఉత్తరాది రాష్ట్రాల్లో దేశానికి పై వైపున కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఢిల్లీ, రాజస్తాన్, యూపీ వంటి రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తూ ఉంది.
ఇప్పుడు ప్రయాణాలకు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆటంకాలు లేవు. ఈ నేపథ్యంలో అక్కడ పెరగుదల చోటు చేసుకోవడం కూడా ఆందోళనకరమైన అంశం. జాగ్రత్త చర్యలు కొనసాగించాల్సిన అవసరాన్ని ఉత్తరాదిన పెరుగుతున్న నంబర్లు తట్టి చెబుతున్నాయి.