తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాత మాటలే మాట్లాడారు. తన గొప్పలు కొట్టుకుంటూ, తన అనుభవం అంతా.. ఇంతా.. అని చెప్పుకుంటూ.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ.. తన హయాంలో ఏం చేసిందీ చెప్పకుండా, ఇప్పుడు మాత్రం అంతా తను చెప్పినట్టుగా చేయాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయి బయటకు వెళ్లాకా చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ముందు లెక్చర్ దంచి కొట్టారు! కామెడీ ఏమిటంటే..తన హాయాంలో రైతులు నష్టపోతే ఆదుకున్న చరిత్ర లేని చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక్కోరికి ముప్పై వేలు ఇవ్వాలి, నలభై వేలు ఇవ్వాలంటూ నోటికొచ్చినట్టుగా డిమాండ్ చేయడం.
చంద్రబాబు నాయుడు హయాంలో రైతులు నష్టపోయిన దాఖలాలు బొచ్చెడు. పంటలు సాగు చేశాకా వర్షాలు రాక రైతులు ముప్పు తిప్పలు పడ్డారు. రాయలసీమలో అయితే వేరుశనగ పంటకు రైతులు భారీ పెట్టుబడులు పెట్టాకా… వర్షాలు వచ్చినట్టే వచ్చి మొహం చాటేయడంతో ఆగస్టు నెలలోనే పంటలు ఎండిపోయి, మాడి మసయ్యాయి.
అప్పుడు చంద్రబాబు నాయుడు రాయలసీమకు వెళ్లి జలఫిరంగులు అంటూ సర్కస్ లు చేశారు. నీళ్లే లేనిది గొట్టాలు పెట్టి ఏం చేసుకోవాలి? అని నాడు రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు! నీళ్లు లేకపోయినా గొట్టాలు పెడితే పంట పారుతుందన్నట్టుగా సాగించి చంద్రబాబు పాలన. ఆ పాలనకు జలఫిరంగులకు పచ్చమీడియా వంత పాట మామూలుగా ఉండేది కాదు!
తన హయాంలో నష్టపోయిన రైతులకు ఎన్ని బీమాలు చెల్లించారో చంద్రబాబు నాయుడు కానీ, టీడీపీ నేతలు కానీ చెప్పగలరా? ఏ మేరకు ఇన్ పుట్ సబ్సిడీలు ఇచ్చింది గణాంకాలను ఈ ఆర్థిక మేధావులు చెప్పగలరా? బీమాలు, ఇన్ పుట్ సబ్సిడీలు తెలుగు రైతులకు అలవాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ హయాంలో పంట నష్టపోయిన సందర్భాల్లో రైతులకు బీమా, ఇన్ పుట్ సబ్సిడీలు అందాయి.
కిరణ్ వాటికి ఎగనామం పెట్టారు, చంద్రబాబు అదే కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఈయన బీమా గురించి లెక్చర్ ఇస్తుండటం కామెడీగా మరేమిటి? ఇక అదే జగన్ విషయానికి వస్తే.. ఇటీవలే అనంతపురం జిల్లాలో అధిక వర్షాలతో వేరుశనగ పంట దుంపనాశనం అయ్యి, రైతులు పంటను చేలలోనే దున్నేయగా ఎకరానికి ఆరు వేల రూపాయల చెల్లింపు చేసింది ప్రభుత్వం.
వలంటీర్ల సమక్షంలో పంటలు దున్నేసి అనేక మంది రైతులు ఎకరానికి ఆరువేల రూపాయల సొమ్మును ఆన్ ద స్పాట్ పొందారు. ఈ పథకం అమలు కొంత సవ్యంగా జరగలేదు. కొందరు రైతులకు ఆ పరిహారం అందలేదు. ఆ విషయంలో జగన్ మోహన్ రెడ్డి స్థాయిలో లోపం లేదు. స్థానికంగా కొంత లోపం కనిపించింది. దాన్ని సవరించాల్సింది. అయితే సమయం దాటిపోయింది. కానీ మెజారిటీ రైతులకు ఆ పరిహారం అందింది.
ఇక ఇన్ పుట్ సబ్సిటీలకు ప్రస్తుతం రాసుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే ఇది అర్థం అవుతుంది. ఈ విషయాన్నే ముఖ్యమంత్రి చెప్పారు. డిసెంబర్ 15 వరకూ నమోదు జరుగుతుందని జగన్ అసెంబ్లీలో వివరించారు. అక్కడ రాద్ధాంతం చేసి, బయటకు వచ్చి మళ్లీ అదే రచ్చ పెట్టారు చంద్రబాబు నాయుడు.
ఇక చంద్రబాబు మాటల్లో మరో కామెడీ ఏమిటంటే.. వైఎస్ రాజశేఖర రెడ్డే మేలు అని అనడం! చంద్రబాబుకు వైఎస్ అసెంబ్లీలో చాలా విలువిచ్చారట, జగన్ ఇవ్వడం లేదట! అయితే చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎలా మాట్లాడేవారో ఇప్పుడూ అలాగే మాట్లాడుతున్నారు.
వెకిలి నవ్వులు అంటూ అప్పట్లో వైఎస్ పై రెచ్చిపోయారు చంద్రబాబు, ఇప్పుడు జగన్ నవ్వులను కూడా అదే మాటే అంటున్నారు. వాళ్లు నవ్వడం, చంద్రబాబు మొహం మాడ్చుకోవడం ఇదే కొనసాగుతోంది. దీన్ని సహించలేక వైఎస్ రాజశేఖర రెడ్డే నయం అంటున్నారు చంద్రబాబు నాయుడు!