మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై ఆయన కుమార్తె డాక్టర్ సునీత పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం సునీత పిటిషన్పై విచారణను ఇవాళ్టికి సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కడప ఎంపీ అవినాష్రెడ్డికి సంబంధించి సోమవారం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం వుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో విచారణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కీలక ప్రకటన చేశారు. సునీత పిటిషన్పై సుప్రీంకోర్టు నంబర్-1లో విచారణ జరగాల్సి వుండింది. అయితే ఐదుగురు జడ్జిలు కరోనాబారిన పడ్డారని, దీంతో విచారణ నిర్వహించే పరిస్థితి లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలిపారు.
కావున డాక్టర్ సునీత పిటిషన్పై విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసినట్టు చీఫ్ జస్టిస్ తెలిపారు. దీంతో సునీత నిరాశకు లోనయ్యారు. వైఎస్ అవినాష్రెడ్డి బెయిల్పై స్టే అంత వరకూ కొనసాగనుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా వుండగా సుప్రీంకోర్టులో కరోనా ఆంక్షలను విధించారు. ఢిల్లీలో కరోనా నెమ్మదిగా వ్యాపిస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
కరోనా బారిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పడడంతో విచారణ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి మరింత బలపడే అవకాశాలున్నాయి.