పులివెందులలో బ‌ల‌గాలు…ఏం జ‌రుగుతోంది!

పులివెందుల‌లో ఏదో జ‌రుగుతోంది. ఇవాళ ఉద‌యం 8 గంట‌ల‌కు స్పెష‌ల్ పార్టీ పోలీసులు పులివెందుల‌లో దిగారు. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి వ‌ద్ద ప్ర‌త్యేక బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అలాగే పులివెందుల‌లో ర‌ద్దీ ప్రాంతాల్లో…

పులివెందుల‌లో ఏదో జ‌రుగుతోంది. ఇవాళ ఉద‌యం 8 గంట‌ల‌కు స్పెష‌ల్ పార్టీ పోలీసులు పులివెందుల‌లో దిగారు. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి వ‌ద్ద ప్ర‌త్యేక బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. అలాగే పులివెందుల‌లో ర‌ద్దీ ప్రాంతాల్లో కూడా స్పెష‌ల్ పార్టీ పోలీసులు బందోబ‌స్తు విధుల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

అక‌స్మాత్తుగా స్పెష‌ల్ పార్టీ పోలీసులు రావ‌డంపై పులివెందుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సుప్రీంకోర్టులో వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత పిటిష‌న్‌పై సోమ‌వారం విచార‌ణ జ‌ర‌గనుంది. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ డాక్ట‌ర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. 24వ తేదీ వ‌ర‌కూ సీబీఐ అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తూ, తిరిగి ఆ రోజు విచారిస్తామ‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టులో సునీత పిటిష‌న్‌పై విచార‌ణ ఉత్కంఠ రేపుతోంది. అవ‌స‌ర‌మైతే అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తామ‌ని ఇప్ప‌టికే న్యాయ‌స్థానానికి సీబీఐ చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిని ఇప్ప‌టికే సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించింది. అలాగే గ‌త రెండు రోజులుగా పులివెందుల‌లో సీబీఐ బృందం కీల‌క సోదాలు నిర్వ‌హించింది.

పులివెందుల‌లో వివేకానంద‌రెడ్డి, అలాగే అవినాష్‌రెడ్డి ఇళ్ల‌లో సీబీఐ బృందం సోదాలు చేసింది. ఆ రెండు ఇళ్ల మ‌ధ్య దూరం, హ‌త్యానంత‌రం ఘ‌ట‌నా స్థ‌లంలో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే విష‌య‌మై మ‌రోసారి సీబీఐ ఆరా తీసింది. సీబీఐ మ‌రో బృందం కీల‌క ఆధారాల‌ను ఇవాళ్టి విచార‌ణ‌లో భాగంగా సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించ‌వ‌చ్చనే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

సుప్రీంకోర్టులో త‌మ‌కు అనుకూల‌మైన ఆదేశాలు వ‌స్తాయ‌నే ఉద్దేశంతో సీబీఐ ముంద‌స్తు పోలీసు బ‌ల‌గాల‌ను పులివెందుల్లో దించార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పు తేల్చ‌నుంది.