మరో సెలబ్రిటీ కపుల్ విడాకులకు సిద్ధమైందా?

ప్రస్తుతం సినీ పరిశ్రమల్లో విడాకుల సీజన్ నడుస్తున్నట్టుంది. చాలామంది తారలు తమ పెళ్లిళ్లను పెటాకులు చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో సెలబ్రిటీ కపుల్ కూడా చేరబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్…

ప్రస్తుతం సినీ పరిశ్రమల్లో విడాకుల సీజన్ నడుస్తున్నట్టుంది. చాలామంది తారలు తమ పెళ్లిళ్లను పెటాకులు చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో సెలబ్రిటీ కపుల్ కూడా చేరబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా విడిపోతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చేలా కొన్ని పరిణామాల్ని పలు మీడియా సంస్థలు బయటపెడుతున్నాయి.

రీసెంట్ గా శిల్పాషెట్టి పేరిట కొన్ని ఆస్తుల్ని బదలాయించాడు రాజ్ కుంద్రా. వీటిలో ప్రస్తుతం వాళ్లు నివశిస్తున్న ఫ్లోర్ కూడా ఉంది. కినారాలోని బీచ్ వ్యూలో ఉన్న భారీ అపార్ట్ మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ మొత్తాన్ని శిల్పాశెట్టి పేరిట బదలాయించాడు రాజ్ కుంద్రా. 5 ఫ్లాట్స్ ఉన్న ఈ ఫ్లోర్ మొత్తం ఖరీదు అటుఇటుగా 38 కోట్ల 50 లక్షల రూపాయలు. బీచ్ కు 300 మీటర్ల దూరంలో ఉండే ఈ ఫ్లాట్ ఇప్పుడు శిల్పాషెట్టి సొంతమైంది.

కేవలం విడిపోయే ఉద్దేశంతోనే భార్యాభర్తల మధ్య ఇలా ఆస్తుల పంపకాలు జరుగుతున్నాయంటూ బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. ఈ ఫ్లోర్ తో పాటు.. ముంబయి శివార్లలో ఉన్న ఓ ఫామ్ హౌజ్ ను కూడా శిల్పాశెట్టి పేరిట బదలాయించాడట కుంద్రా.

గతేడాది పోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కున్నాడు రాజ్ కుంద్రా. అమ్మాయిలతో నీలిచిత్రాలు తీసి పలు యాప్స్ లో పెట్టి వ్యాపారం చేశాడనేది అతడిపై ప్రధాన అభియోగం. ఆ కేసులో అరెస్టైన సందర్భంలోనే శిల్పాషెట్టి-రాజ్ కుంద్రా విడాకుల వ్యవహారం తెరపైకొచ్చింది. వీళ్లిద్దరూ ఇక ఎంతమాత్రం కలిసి ఉండరంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. వాటికి మరింత బలం చేకూర్చేలా ఇప్పుడు ఆస్తుల బదలాయింపు ప్రక్రియ జరుగుతోంది.