2018లో తెలంగాణలో కాంగ్రెస్తో టీడీపీకి ఏర్పడిన అవినాభావ సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ దఫా తెలుగేతర ప్రాంతంలో జాతీయ పార్టీతో టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడం గమనార్హం. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్, టీడీపీ ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అండమాన్ నికోబార్లో మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కలిసి కట్టుగా ముందుకు సాగడమే సరైందని కాంగ్రెస్, టీడీపీ అవగాహనకు రావడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలో అక్కడి ఇరుపార్టీల నాయకులు నిర్ణయానికి వచ్చారు.
పోర్టుబ్లెయిర్ మున్సిపాలిటీలో 2,5,16 వార్డుల్లో టీడీపీ పోటీ చేయనుంది. మిగిలిన చోట్ల కాంగ్రెస్ పోటీ చేయనుంది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగు సమాజంపై అవతరించిన టీడీపీ …కాలానికి అనుగుణంగా వచ్చిన రాజకీయ మార్పులకు తగ్గట్టు మారుతూ వస్తోంది. 2018లో తెలంగాణలో కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి టీడీపీ పొత్తు కుదుర్చుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది.
ఆ ఎన్నికల్లో టీడీపీ పొత్తు వల్లే తిరిగి కేసీఆర్ సీఎం అయ్యారనే ప్రచారం లేకపోలేదు. తెలంగాణలో చంద్రబాబు ప్రవేశాన్ని సాకుగా తీసుకొని, మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్ను రగిల్చి కేసీఆర్ రాజకీయంగా లబ్ధి పొందారని కాంగ్రెస్ వాపోయిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేందుకు కాంగ్రెస్, టీడీపీ మైత్రీ నిదర్శనం.