చలో విజయవాడ అంటూ జరిగిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ర్యాలీ విషయంలో వినిపిస్తున్న ప్రముఖమైన అంశం.. ఉద్యోగులు ముసుగులో పచ్చ పార్టీ కార్యకర్తలు కూడా హల్చల్ చేశారనేది! వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఏ ఒక్క అంశాన్నీ టీడీపీ వదులుకోవడం లేదు.
ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల నిరసనను ఆదిలోనే టేకోవర్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉద్యోగులకు బేషరతుగా మద్దతు అని, ఎక్కడిక్కడ పచ్చ పార్టీ కార్యకర్తలు వెళ్లి ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించాలంటూ చంద్రబాబు ఆదేశించారు.
అయితే ఆదిలో ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ఉద్యోగులు కూడా ఇష్టపడలేదు. అయితే ఉద్యోగులపై చంద్రబాబు ప్రేమ ప్రకటన చేస్తూనే వచ్చారు! ఇలాంటి క్రమంలో… ఇక ఉద్యోగుల పోరాటం వీధికి ఎక్కడంతో పచ్చపార్టీ కార్యకర్తలు కూడా ఉద్యోగులు అయిపోయినట్టుగా తెలుస్తోంది.
చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడానికి ఉద్యోగుల కొరత ఏమీ లేదు. జీతాల కోసం వారు ఎందాకైనా తెగించేలా ఉన్నారు. అయితే ఇంకా ఈ ఉద్యమం గట్టిగా సాగుతోందని చెప్పడానికి, హల్చల్ చేయడానికి, వీలైతే.. గలాభాలు సృష్టించడానికి పచ్చ పార్టీ వ్యూహాత్మకంగా కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది.
అక్కడకు వచ్చే వారంతా ప్రభుత్వ ఉద్యోగుల కిందే లెక్క! ఎవరూ ఐడీ కార్డులు ధరించాల్సిన అవసరంలేదు! దీన్నే పచ్చ పార్టీ కార్యకర్తలు అదునుగా తీసుకున్నారని తెలుస్తోంది. ఎక్కడైనా ఉద్యోగులు వెనక్కు తగ్గుతారేమో, నినాదాలు ఇవ్వడంలో వెనక్కు తగ్గుతారేమో అనే లెక్కలతో పచ్చ పార్టీ ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తూ ఉంది.
గుంపులో గోవింద అన్నట్టుగా ఈ వ్యవహారంలో పచ్చ పార్టీ ప్రమేయం ఉన్నట్టుంది. మరి ముందు ముందు ఈ ఉద్యమం ఎలాంటి పుంతలు తొక్కుతుందో.. పచ్చ పార్టీ ప్రమేయం ఎలా సాగుతుందో!