మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తనయుడు లోకేశ్ తన మార్క్ శుభాకాంక్షలను ట్విటర్ వేదికగా తెలిపారు. తండ్రీకొడుకుల కామెడీ భలే పసందుగా వుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే పేదలను మరింత పేదలుగా తయారు చేయడంలో పాలకుడిగా చంద్రబాబు విజయవంతమయ్యారు. కార్పొరేట్ శక్తుల ఆదాయం పెంపునకు తప్ప, సామాన్యుల కోసం చంద్రబాబు పాలన కానేకాదని ప్రత్యర్థుల విమర్శ.
తన తండ్రికి జన్మ దిన శుభాకాంక్షలు చెబుతూ… చంద్రబాబు మాట్లాడిన వీడియోని లోకేశ్ షేర్ చేయడం గమనార్హం. ఆ వీడియోలో చంద్రబాబు ప్రవచనాలేంటో తెలుసుకుందాం.
“నా జీవితాశయాలు రెండు. పేదరికం లేని సమాజం. అది ఎన్టీఆర్ రామారావు సిద్ధాంతం. అదే సమయంలో ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థలకు శ్రీకారం చుట్టాలి. ప్రతి కుటుంబాన్ని ధనిక కుటుంబంగా చేసి, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేలా ముందుకు తీసుకెళ్లాలి. అలాగే ప్రపంచంలోనే తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనేది నా కోరిక” అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఇక తండ్రికి బర్త్ డే విషెస్ను లోకేశ్ ఏ విధంగా చెప్పారో చూద్దాం. ‘పేదరికం లేని సమాజం స్థాపించి, ఆర్థిక అసమానతలు తొలగించే వ్యవస్థను తెలుగు ప్రజలకు శాశ్వత వారసత్వంగా ఇచ్చేందుకు మీరు చేసే కృషి చిరస్థాయిగా నిలుస్తుంది. ప్రపంచంలో తెలుగుజాతి అగ్రగామిగా నిలవాలనే మీ ఆకాంక్ష తీరాలి నాన్నా’ అంటూ లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అందుకేనా రాజధాని అమరావతిలో పేదలకు జగన్ సర్కార్ ఇళ్లు కట్టించాలని నిర్ణయిస్తే…మీ తండ్రి పరోక్షంగా అడ్డుకుంటున్నదని ప్రత్యర్థులు దెప్పి పొడుస్తున్నారు. 1983 నుంచి అత్యధిక కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన ఘనత తనదిగా చెప్పుకునే చంద్రబాబు, ఏపీలో పేదరికానికి బాధ్యుడు కాదా? అంటూ నిలదీస్తున్నారు. పేదలు మరింతగా పేదరికంలో మగ్గిపోవడానికి చంద్రబాబు పాలనా విధానాలే కారణమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
వ్యవసాయక రాష్ట్రమైన ఏపీలో సేద్యం దండుగ అన్న పాలకుడు… నేడు ఆర్థిక అసమానతలు లేని, పేదరికం లేని సమాజం స్థాపించడమే తన ఆకాంక్ష అని చెప్పడం విడ్డూరంగా వుందని విమర్శిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ భలే కామెడీ చేస్తున్నారని, బాగుందయ్యా తండ్రీకొడుకుల యవ్వారం అంటూ ప్రత్యర్థులు వెటకారం చేస్తున్నారు.