కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ చదివి వినిపించిన బడ్జెట్ అసాంతం డొల్లతనం, మాటల గారడీతో నిండి ఉందని కేసీఆర్ తన మార్క్ పంచ్లతో విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసిందని తన నిరసన వ్యక్తం చేశారు.
దశ, దిశ, నిర్దేశం లేని, పసలేని నిష్ప్రయోజకర బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. ఈ బడ్జెట్ దేశంలోని సామాన్యులు మొదలుకుని అన్ని వర్గాల వారిని తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. మసిపూసి మారేడుకాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ ఇది అని ఆయన దెప్పి పొడిచారు.
కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుందే తప్ప, ఇందులో ఏమీ లేదన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు శూన్యమన్నారు. దేశ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఇది బిగ్ జీరో బడ్జెట్గా ఆయన అభివర్ణించారు. దేశ చేనేత రంగానికి బడ్జెట్లో చేసిందేమీ లేదని విమర్శించారు.
ఉద్యోగులు, చిరు వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ల స్లాబ్లు మార్చకపోవడం విచారకరమ న్నారు. కరోనాతో దేశం అల్లాడుతుంటే దేశ ప్రజల ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టకపోవడం దురదృష్టకరమన్నారు. ఇది ముమ్మాటికీ దేశ ప్రజల వ్యతిరేక బడ్జెట్గా కేసీఆర్ విమర్శించారు.