ఆళ్ల‌తో ఎల్లో గ్యాంగ్ మైండ్ గేమ్‌

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డితో ఎల్లో గ్యాంగ్ మైండ్ గేమ్ ఆడుతోంది. మంగ‌ళ‌గిరిలో లోకేశ్‌ను ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి 2019లో ఓడించిన సంగ‌తి తెలిసిందే. మంత్రి హోదాలో లోకేశ్ మంగ‌ళ‌గిరి బ‌రిలో నిలిచి ఓట‌మి మూట‌క‌ట్టుకోవ‌డాన్ని…

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డితో ఎల్లో గ్యాంగ్ మైండ్ గేమ్ ఆడుతోంది. మంగ‌ళ‌గిరిలో లోకేశ్‌ను ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి 2019లో ఓడించిన సంగ‌తి తెలిసిందే. మంత్రి హోదాలో లోకేశ్ మంగ‌ళ‌గిరి బ‌రిలో నిలిచి ఓట‌మి మూట‌క‌ట్టుకోవ‌డాన్ని టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. 2024లో కూడా అక్క‌డి నుంచే తాను పోటీ చేసి, గెలిచి టీడీపీకి గిఫ్ట్‌గా ఇస్తాన‌ని లోకేశ్ శ‌ప‌థం చేసిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి కొన్ని కార‌ణాల వ‌ల్ల సీఎం జ‌గ‌న్‌పై అసంతృప్తిగా ఉన్నారు. లోకేశ్‌పై గెలిస్తే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌గ‌న్ హామీ ఇచ్చారు. అయితే హామీని మాత్రం నిల‌బెట్టుకోలేదు. మ‌రోవైపు మంగ‌ళ‌గిరిలో చేనేత ప్ర‌ముఖుల్ని వైసీపీలో చేర్చుకున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో ఆళ్ల‌ను కాద‌ని, చేనేత నాయ‌కుడికి టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆళ్ల అల‌క‌బూనార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల జ‌గ‌న్ నిర్వ‌హించిన వైసీపీ ఎమ్మెల్యేల కీల‌క స‌మావేశానికి ఆళ్ల హాజ‌రు కాక‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల ప్ర‌చారానికి తెర‌లేచింది. తాజాగా మా న‌మ్మ‌కం జ‌గ‌న‌న్నే ఇంటింటి కార్య‌క్ర‌మానికి కూడా ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి హాజ‌రు కావ‌డం లేద‌నే వార్త‌లొచ్చాయి. పార్టీని వీడ‌తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. దీంతో ఆయ‌న మీడియా ముందుకొచ్చారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్‌ను వీడే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

2024లో తిరిగి వైసీపీ జెండానే మంగ‌ళ‌గిరిలో ఎగురుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. చంద్ర‌బాబు పాల‌న అధ్వానంగా ఉండ‌డం వ‌ల్లే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని, మంగ‌ళ‌గిరిలో లోకేశ్‌ను ఓడించార‌ని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నిక‌ల్లో త‌మ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కే న‌డుచుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. వైసీపీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోవ‌డం, ఇత‌ర‌త్రా అసంతృప్తుల‌పై సాగుతున్న ప్ర‌చారాల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో ఎల్లో మైండ్ గేమ్‌కు ఆయ‌న చిక్క‌డం లేదు.