చదివిన చదువుకు చేసే పనికి సంబంధం లేదన్నట్లుగానే.. చేస్తున్న ఉద్యోగానికి వెలగబట్టే పనులు కూడా సంబంధం ఉండదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. పెద్ద చదువులు చదువుకున్నాడు, తెలంగాణలో వైద్య శాఖకి పెద్దదిక్కుగా ఉన్నారు. పైగా వైద్యుడు. సామాన్య ప్రజలకు మూఢనమ్మకాలపై అతి విశ్వాసం వల్ల జరిగే అనర్థాలను వివరించాల్సిన పోయి తానే పెద్ద మూఢనమ్మకాస్తుడని ఎప్పుడూ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు.
నిత్యం వివాదాల మాటలతో వార్తల్లో నిలిచే ఆయన నోటీ నుండి మరో అణిముత్యం వచ్చింది. తాజాగా కొత్తగూడెం ఇఫ్తార్ విందులో మాట్లాడుతూ.. తాయత్తు మహిమతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని.. డాక్టర్లు చేయలేని పని తాయత్తు చేసిందన్నారు. బహుశా తన దగ్గరి వచ్చే రోగులకు కూడా తాయత్తు కడుతున్నారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
ఇలా వివాదాస్పదంగా వ్యవహరించడం ఆయనకు ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గోన ఆయన.. యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యామని.., మనం చేసిన సేవల వల్ల కాదు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే గతంలో కొత్తగూడెం జిల్లా జిమ్నా తండాలో సుజాత నగర్ ఎంపీపీ విజయలక్ష్మితో కలిసి వింత పూజలు చేశారు. అగ్నిగుండంలో నిమ్మకాయలు, ఎండు మిర్చి వేసి ఎంపీపీ చుట్టూ ఆయన ప్రదక్షిణలు చేశారు.