ఈడీ ఆఫీస్కు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ సమాచారం. అయితే ఇందులో ట్విస్ట్ వుంది. కవితను విచారణ కోసం రావాలని ఈడీ కోరకపోవడం గమనార్హం. ఇప్పటికే మూడుసార్లు ఈడీ విచారణకు కవిత హాజరైన సంగతి తెలిసిందే. ప్రతి విచారణ సందర్భంలోనూ కవితను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. సుదీర్ఘంగా విచారించడంతో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంటుందనే ప్రచారం విస్తృతంగా సాగింది.
అయితే ఊహలు, అంచనాలు వేసిన వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈడీ నుంచి కవిత ఈమెయిల్కు ఓ సందేశం వెళ్లింది. విచారణ సందర్భంగా ఈడీకి ఈ నెల 21న కవిత సమర్పించిన 9 సెల్ఫోన్లకు సంబంధించి ఓపెన్ చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలని ఈడీ కోరింది.
ఒకవేళ కవిత రాలేని పక్షంలో ఆమె తరపున మరెవరినైనా పంపాలని ఈడీ అధికారులు సూచించడం గమనార్హం. దీంతో కవిత తన ప్రతినిధిగా లీగల్ అడ్వైజర్ సోమా భరత్కు ఆథరైజేషన్ ఇచ్చి తన ప్రతినిధిగా ఈడీ కార్యాలయానికి పంపినట్టు సమాచారం.
ఐదు గంటల పాటు ఈడీ కార్యాలయంలో భరత్ ఉన్నారు. కాసేపటి క్రితం ఆయన ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించినప్పటికీ, ఆశించిన ఊరట ఆమెకు లభించలేదు. కవిత విచారణ ఎపిసోడ్ ఇంకెంత కాలం సాగుతుందో చూడాలి.