వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మకు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని పేర్ని నాని అపాయింట్మెంట్ ఇవ్వడంపై టీడీపీ అనుకూల సినీ పెద్దలకు, మీడియాకు పలు అనుమానాలొస్తున్నాయి. సినిమా టికెట్ల ధరల నియంత్రణకు సంబంధించిన ఎపిసోడ్లో ఏపీ ప్రభుత్వం సంధించిన బాణమే వర్మ అని వాళ్లు సందేహిస్తున్నారు. ఎందుకంటే తాము పదేపదే అడిగినా ఆహ్వా నించని ఏపీ ప్రభుత్వం… తనను విమర్శించిన వర్మను మాత్రం వెంటనే రావాలని పిలవడం అనుమానానికి కారణమైంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వర్మ తన అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. అంతేకాదు జగన్ వ్యతిరేకించే చంద్రబాబు, లోకేశ్, పవన్కల్యాణ్ అంటే వర్మకు విపరీతమైన కోపం. ఆ ముగ్గురిని వెటకరిస్తూ పలు సినిమాలను వర్మ తనదైన శైలిలో తెరకెక్కించి వివాదాలను సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి వర్మ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం అంతా స్కెచ్లో భాగమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
వర్మ, మంత్రి నాని మధ్య ట్విటర్ వేదికగా వార్ నడిచిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో తనకు అపాయింట్ మెంట్ ఇస్తే … వచ్చి కలుస్తానని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తానని మంత్రి నానికి వర్మ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇందు కు నాని వైపు నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10న మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి తనను మంత్రి ఆహ్వానించారని వర్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
నానికి ట్విటర్ వేదికగా నాని ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇక్కడే ఎల్లో బ్యాచ్కు అనుమానం వస్తోంది. అసలు సినిమాలు తీయని వర్మ టాలీవుడ్కు పెద్దరికం వహించడం, ఆయన పేరుతో సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం అనుకోవడం దేనికి సంకేతం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ భేటీ తర్వాత ఏపీ ప్రభుత్వం వేసిన స్కెచ్ ఏంటో అర్థమవుతుందనే చర్చ నడుస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా అనుమానిస్తున్నట్టు ఇందులో వ్యూహం ఉందా? లేదా? అనేది భేటీ తర్వాత తెలిసే అవకాశం ఉంది.