ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన కేసులో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీని న్యాయ స్థానం దోషిగా తేల్చింది. అసలేం జరిగిందంటే….2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కర్నాటకలోని కోలార్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ దేశంలో దొంగల ఇంటి పేరు మోదీ అనే ఎందుకుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తమ కమ్యూనిటీని అవమానించేలా రాహుల్ వ్యాఖ్యలున్నాయంటూ గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఆయనపై సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. విచారణ అనంతరం రాహుల్ను న్యాయస్థానం గురువారం దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది.తనకు విధించిన శిక్షపై సవాలు చేసేందుకు వీలుగా రాహుల్ శిక్షను 30 రోజలుపాటు సస్పెండ్ చేసింది.
ఇదిలా వుండగా తీర్పు వెలువడే ముందు రాహుల్ గాంధీకి మద్దతుగా కోర్టు బయట కాంగ్రెస్ శ్రేణులు పోస్టర్లు ఏర్పాటు చేశాయి. “ప్రజాస్వామ్యానికి మద్ధతుగా భగత్ సింగ్, సుఖ్దేవ్ ఫొటోలతో సూరత్ వెళ్దాం” అని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. రాహుల్కు పరువు నష్టం కేసులో శిక్ష పడడం, అనంతరం బెయిల్ మంజూరు కావడంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2019 నాటి ఘటన మరోసారి తెరపైకి వచ్చింది.