విశాఖలో సెకండ్ సిట్టింగ్స్… ?

విశాఖ పరిపాలనా రాజధాని సంగతేమో కానీ రాజకీయ రాజధానిగా మాత్రం బాగానే వేడెక్కిస్తోంది. ముఖ్యమైన బలమైన ఒక సామాజికవర్గం తన గొంతుని విప్పి రీ సౌండ్ చేసింది విశాఖలోనే. అది కూడా ఈ మధ్యనే.…

విశాఖ పరిపాలనా రాజధాని సంగతేమో కానీ రాజకీయ రాజధానిగా మాత్రం బాగానే వేడెక్కిస్తోంది. ముఖ్యమైన బలమైన ఒక సామాజికవర్గం తన గొంతుని విప్పి రీ సౌండ్ చేసింది విశాఖలోనే. అది కూడా ఈ మధ్యనే.

కాపులకే ముఖ్యమంత్రి పదవి దక్కాలీ దక్కుతుంది అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రీసెంట్ గా రంగా విగ్రహావిష్కరణలో చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో కాపులను తోసిరాజని ఏ రాజకీయం సాగదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆ తరువాత గొలుసుకట్టు మాదిరిగా అనేక రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి.

ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత హైదరాబాద్ లో లైక్ మైండెడ్ కాపు నేతలతో ఒక మీటింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ మీటింగ్ సారాంశం కూడా కాపులు ఐక్యంగా ముందుకు రావాలని, రాజకీయంగా అగ్ర స్థానానికి చేరుకోవాలని. ఆ తరువాత సెకండ్ సిట్టింగ్ విశాఖలోనే అంటున్నారు. ఈ సంక్రాంతి లోపుగానే గంటా నాయకత్వాన మరోసారి కాపునేతలు, మాజీ మంత్రులు, రాజకీఎయ పెద్దలు కలవబోతున్నారని టాక్.

హైదరాబాద్ లో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీ నారాయణ, వంగవీటి రాధా వంటి వారు హాజరయ్యారు. ఇపుడు విశాఖ మీటింగునకు కూడా అంతకు మించి పెద్ద సంఖ్యలో కాపు నాయకులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

మొత్తానికి కీలకంగా మారబోతున్నా ఈ సెకండ్ సిట్టింగ్స్ మీద ఏపీ రాజకీయాలు మొత్తం ఫోకస్ అయ్యాయనే చెప్పాలి. ఈ మీటింగ్ లో సంచలన నిర్ణయమే వెలువడుతుందా అన్న ఆసక్తి కూడా ఉంది. మొత్తానికి సంక్రాంతి పండుగకు ముందే జరగనున్న ఈ సమావేశం కాపులకు పండుగ లాంటి శుభ‌ వార్త వినిపిస్తుందా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. చూడాలి మరి. ఏం జరుగుతుందో.