ఎవరైనా న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటేనే కమలం పార్టీ నేతలకు చాలా బాధేస్తుంది. ఆంగ్ల సంవత్సరాదిని సెలబ్రేట్ చేసుకోవడం ఏమిటంటూ భక్తగణం వాట్సాప్ మెసేజ్ లలో బాధపడుతూ ఉంటుంది. వాళ్ల ఇళ్లల్లో, వాళ్ల పిల్లలు న్యూ ఇయర్ ను జనవరి ఒకటో తేదీన ఏ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నా, ఈ పాశ్చాత్య సంస్కృతి పట్ల భక్తులు ఖిన్నులవుతూ ఉంటారు.
మరి ఈ జాతీయవాదులు.. న్యూ ఇయర్ ను గుట్టుగా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కానీ, జనవరి ఒకటో తేదీన బీజేపీ విజయవాడ సిటీ ఆఫీస్ లో మాత్రం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్ లో సాగాయి. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యిందిప్పుడు.
ఆరేసుకోబోయి పారేసుకోవడం మొదలుపెడితే.. న్యూ ఇయర్ సందర్భంగా బీజేపీ నేతల డ్యాన్సులు ఒక రేంజ్ లో సాగాయి. ఆడ, మగ తేడా లేకుండా.. చిందులేని న్యూ ఇయర్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు కమలం పార్టీ నేతలు, కార్యకర్తలు. విజయవాడ సిటీ ఆఫీస్ బీజేపీ నేతల న్యూ ఇయర్ డ్యాన్సులకు వేదిక అయ్యింది.
వెనుక వైపు ప్రధాని మోడీ, నడ్డా, సోము వీర్రాజు ల ఫ్లెక్సీ ఉండగా.. ఆ వేదిక పైనే బీజేపీ నేతల చిల్లర డ్యాన్సుల పరంపర కొనసాగింది. మాటెత్తితే, భారతీయత, విలువలు, జాతీయ వాదం, హిందుత్వం.. అంటూ కమలం పార్టీ నేతల నీతులకు హద్దే ఉండదు. మరి ఈ ప్రవచనాల పార్టీ ఆఫీసులోనే.. చిల్లర డ్యాన్సులతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హోరెత్తాయి.
ఇటీవలే ఏపీ బీజేపీ విభాగం అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ అధికారంలోకి వస్తే, రాష్ట్ర రెవెన్యూని ఉపయోగించుకుని యాభై రూపాయలకే చీప్ లిక్కర్ ను ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. మరి ఆ ప్రకటన ఉత్సాహం బీజేపీ నేతల చిల్లర డ్యాన్సుల్లో కనిపిస్తున్నట్టుంది.