బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన విమర్శ రాజకీయంగా కలకలం రేపుతోంది. “కవితను అరెస్ట్ చేయకపోతే, ముద్దు పెట్టుకుంటారా?” అని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముద్దు పెట్టుకుంటారా? అనే కామెంట్పై బీఆర్ఎస్ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యినట్టు సమాచారం. కవితపై బండి వ్యాఖ్యలను మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి సుమోటోగా తీసుకున్నారు.
వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని బండి సంజయ్కి మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. బండి సంజయ్పై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ డీజీపీని ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ దిష్టిబొమ్మలను తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేస్తున్నాయి.
కవితపై బండి సంజయ్ అభ్యంతరకర వ్యాఖ్యలపై మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరోవైపు కవితపై బండి వ్యాఖ్యలను బీజేపీ నేతలు సమర్థిస్తున్నారు. కవితపై బండి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత సీరియస్గా స్పందించారు. బండి సంజయ్ని వెంటనే ఆస్పత్రిలో చేర్చాలని డిమాండ్ చేశారు.
కవితకు క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా వుంటాయని ఆమె హెచ్చరించారు. బండి సంజయ్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని మంత్రి సబితారెడ్డి ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా మహిళలందరికీ బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని సబితా డిమాండ్ చేశారు. వ్యక్తిగత విమర్శలు మంచిది కాదన్నారు. బండి సంజయ్ని మహిళలు బట్టలూడదీసి కొడతారని ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఘాటుగా హెచ్చరించడం గమనార్హం. కవితను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో రాజకీయం ఉద్రిక్తతకు దారి తీసింది.