వంగలపూడి అనిత… టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు. ఒక దఫా ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేవలం ఐదేళ్ల కాలానికే ఆమె భరించలేం “బాబు” అంటూ టీడీపీ అధినేతకు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు మొరపెట్టుకున్నారు. పాయకరావుపేట టీడీపీ శ్రేణులే కాదు, సామాన్య ప్రజానీకం కూడా అనిత వ్యవహారశైలితో విసిగిపోయి వుంది.
దీంతో ఆమెకు 2019లో పాయకరావుపేట టికెట్ ఇవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి ప్రస్తుత హోంశాఖ మంత్రి తానేటి వనితపై ఈ అనితమ్మను నిలిపారు. పోటీ ఎక్కడైతేనేం అనిత ఓడిపోయారు. కొవ్వూరు నుంచి ఆమె మకాం మార్చారు. మళ్లీ పాయకరావుపేట కేంద్రంగా రాజకీయాలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఆ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనిత పేరు చెబితే కిలో మీటర్ పరుగు తీసే పరిస్థితి.
ఏది ఏమైనా తనకు టికెట్ కావాలని ఆమె పట్టు పడుతున్నారు. ఆరు నూరైనా ఆమెకు టికెట్ ఇవ్వొద్దని టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. కాదు, కూడదని అనితకే టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి అత్యంత నిబద్ధత కలిగిన నాయకురాలిగా నిరూపించుకునేందుకు అనిత సర్కస్ ఫీట్స్ చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ గుడ్లుక్స్లో పడేందుకు ప్రతి అవకాశాన్ని ఆమె ఉపయోగించుకుంటున్నారు.
కోటి విద్యలూ కూటి కోసమే అనే చందంగా కోటి కార్యకలాపాలు పాయకరావుపేట టికెట్ కోసమే అన్నట్టు ఆమె వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనిత ప్రసంగాన్ని మార్ఫింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గెలిపించేందుకు మహిళలంతా సిద్ధంగా ఉండాలని ఆమె అన్నట్టు ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
నిజానికి ఆమెకు కావాల్సింది కూడా ఇలాంటివే. సంచలనాల ద్వారా టీడీపీలో కీలక నాయకురాలిగా గుర్తింపు పొంది, తనకు టికెట్ ఇవ్వని పరిస్థితిని క్రియేట్ చేయడం ఆమె ఎత్తుగడ. అయితే అనిత ఆలోచనల్ని పసిగట్టలేని స్థితిలో చంద్రబాబు లేరు. పాపం లోకేశ్ మాత్రం అనిత చర్యలకు బోల్తా పడ్డట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన అనిత …ఇటీవల కాలంలో చంద్రబాబును కాదని లోకేశ్ను నమ్ముకుంటే టికెట్ దక్కుతుందని, ఆ యువనాయకుడి వెంట తెగ ప్రదక్షిణ చేస్తున్నారు. టికెట్ ఇచ్చేంత వరకూ ఆమె ఏదో రకంగా యాగీ చేస్తూనే వుంటారు.
అనిత బాధను అర్థం చేసుకుని, ఆమెకు పాయకరావుపేట టికెట్ విషయమై గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఒక పనై పోతుంది. లేదంటూ అంత వరకూ అనిత రచ్చ చేస్తూనే వుంటారు. ప్రత్యర్థులపై అరేయ్, ఒరేయ్, నా కొడకల్లారా లాంటి బూతు మాటలు అందమైన అనిత నుంచి వినాల్సి వస్తుంది. ఎంతైనా అనిత ఈ కాలం నాయకురాలు. టికెట్ ఎలా తెచ్చుకోవాలో బాగా తెలుసని ఆమె అభిమానులు అంటుంటారు. కాకపోతే కాస్త సమయం పట్టొచ్చు అని వారు చెబుతున్నారు.
టికెట్ వచ్చే వరకూ లోకేశ్ చుట్టూ ఆమె తిరుగుతూనే వుంటారు. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమిస్తున్న చందంగా అని చెప్పుకోవాల్సి వుంటుంది. కాస్త అనితను పట్టించుకోండయ్యా సామి… గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఎవరికీ కనిపించకుండా పాయకరావుపేటలో టీడీపీని బలోపేతం చేస్తారు కదా? మంచి పనికి ఆలస్యం ఎందుకో ఎవరికీ అర్థం కాదు.