తనపై సీబీఐ ఆధ్వర్యంలో కుట్రలు జరుగుతున్నాయని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని .. వేరే కారణాలతో వివేకా హత్య జరిగి ఉంటే, దాన్ని తన మెడకు చుట్టే ప్రయత్నం జరుగుతోందని అంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించినట్టుంది. ఈ మేరకు స్టాండ్ విత్ వైఎస్ అవినాష్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
తనపై కుట్ర జరుగుతోందని, తను న్యాయ పోరాటం చేసి దాన్ని ఎదుర్కొంటానంటూ ప్రకటించిన అవినాష్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇలా ప్రకటించింది. తద్వారా వైఎస్ అవినాష్ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిలవడానికి రెడీ అయినట్టుగా ఉంది.
రాజకీయంగా తమ ఎదుగుదలకు వైఎస్ వివేకానందరెడ్డి అడ్డు అవుతాడని అవినాష్ రెడ్డి ఆయనను హత్య చేయించాడనేది సీబీఐ విచారణ అంటూ పచ్చమీడియా బాగా ప్రచారం చేసి పెడుతున్న అంశం. ఇలాంటి నేపథ్యంలో సీబీఐ విచారణ తీరును కూడా తప్పు పడుతూ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.
అలాగే వైఎస్ వివేకానందరెడ్డి రెండో పెళ్లి, ఆస్తుల గొడవలు ఆయన హత్యకు కారణం అయి ఉండవచ్చని అవినాష్ రెడ్డి అన్నారు. విచారణ నిష్పాక్షింగా లేదంటూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వ్యాఖ్యానించారు. న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.