పచ్చ కండువాతో ముచ్చటగా…!

ఆయనను అలా చూడడానికి రెండు కళ్ళూ చాలడం లేదు తమ్ముళ్ళకు. ఆయన చురుకుదనం వారికి ఆశ్చర్యంగా ఉంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు చాన్నాళ్ళకు పచ్చ…

ఆయనను అలా చూడడానికి రెండు కళ్ళూ చాలడం లేదు తమ్ముళ్ళకు. ఆయన చురుకుదనం వారికి ఆశ్చర్యంగా ఉంది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు చాన్నాళ్ళకు పచ్చ కండువాను నిండుగా కప్పుకుని దర్శనం ఇచ్చారు.

ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలని ఆయన ప్రచారం చేస్తున్నారు. పట్టభద్రుల మౌనం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. టీడీపీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించి వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటి ఫలితం ఇవ్వాలని, గుణపాఠం చెప్పాలని గంటా కోరుతున్నారు.

లోకల్ బాడీస్ కి జరిగిన ఎన్నికల్లోనూ అంతకు ముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇలాంటి చెంపపెట్లు చాలా టీడీపీకి జనాలు ఇచ్చారు. అపుడు పెద్దగా సౌండ్ చేయని గంటా ఇపుడు మాత్రం వైసీపీకి  చెంప పెట్టు పెట్టాలని కోరడం పట్ల సొంత పార్టీలోనూ  వైసీపీలోనూ విస్మయం వ్యక్తం అవుతోంది.

ఇదే చురుకుదనం గతంలో మాజీ మంత్రికి ఎందుకు లేదో అని సొంత పార్టీ వారే చెవుకు కొరుక్కుంటున్న పరిస్థితి ఉంది. గంటా బరిలోకి దిగారు కనుక టీడీపీ ఎమ్మెల్సీ విజయం ఖాయమా అంటే ఫలితం చూసి అపుడు మాట్లాడాలి అని అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది వ్యవధి ఉన్న వేళ గంటా మౌనం వీడి గడప దాటి బయటకు రావడం ఒక ఎత్తు అయితే పచ్చ కండువాతో కనువిందు చేస్తున్నారు అని తమ్ముళ్ళు అంటున్నారు. గంటా దూకుడుకు ఓట్ల పంట పండుతుందా అన్నది బ్యాలెట్ బాక్సులు చెప్పాలి.