కమలం పార్టీ నేతలు ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్రలు చేపట్టారు. మొన్ననే ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాశీలో పూజలు నిర్వహించారు. మోడీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దేశంలోని టీవీ చానళ్లన్నీ లైవ్ లో చూపించాయి.
మోడీ పూజలతో కొందరిలో ఆధ్యాత్మికత వెల్లివిరయగా, మరి కొందరు మాత్రం… ఇదంతా బీజేపీ మార్కు మత రాజకీయమని, అదే యూపీ వివిధ రకాల ఇబ్బందులతో సతమతం అవుతోందని విమర్శించారు.
ఇక దీన్నంతా జనం ఎలా తీసుకుంటారో.. ఎన్నికల ఫలితాలే చెప్పాలి. ఇప్పటి వరకూ బీజేపీకి దేశంలో తిరుగు లేదు కాబట్టి.. ఇదంతా ప్రజలకు బాగా నచ్చుతోందని అనుకోవాలి.
ఆ సంగతలా ఉంటే.. మరోవైపు ముఖ్యమంత్రుల బ్యాచ్ ఆయోధ్య, కాశీ యాత్రలను చేపట్టింది. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయోధ్య, కాశీ యాత్రలను చేపట్టారు.
తొమ్మిది రాష్ట్రాల సీఎంలు, ఆ రాష్ట్రాల్లోని డిప్యూటీ సీఎంలు అయోధ్య, కాశీ యాత్రలను చేపట్టారు. ముందుగా అయోధ్య, ఆ తర్వాత కాశీలను సందర్శించింది బీజేపీ ముఖ్యమంత్రుల బృందం.
ఇక వారు మాత్రమే కాదు.. మేయర్లు కూడా ఒక బృందంగా ఏర్పడి కాశీ యాత్రను చేపట్టారు. దేశ వ్యాప్తంగా వంద నగరాల మేయర్లు ఒక బృందంగా ఏర్పడి కాశీ యాత్రను చేపట్టారు.
మొత్తానికి దేశ రాజకీయాలు మందిరం, మతం చుట్టూరానే పరిభ్రమిస్తున్నాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అయితే తన పార్టీకి నిర్వచనాన్నే మతం కోణంలో ఇచ్చారు.
టెంపుల్, మసీద్, చర్చ్ అంటూ టీఎంసీకి ఆమె పక్కా మత నిర్వచనాన్ని ఇచ్చారు! మోడీనేమో పూజలు, రాహుల్ గాంధీనేమో తను హిందువును అంటూ కుల గోత్రాలు వల్లె వేస్తున్నారు!
ప్రజల సంగతెలా ఉన్నా.. నేతలు మాత్రం మతం తప్ప మరో అజెండా లేదన్నట్టుగా వ్యవరించడమే తాజా రాజకీయం లాగుంది!