మాటెత్తితే తనది 40 యేళ్ల అనుభవం..దేశంలో ప్రధానిగా ఎవరుండాలి, రాష్ట్రపతిగా ఎవరుండాలి.. గవర్నర్ పదవులు ఎవరికి ఇవ్వాలి తనే డిసైడ్ చేసినట్టుగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు!
అలాంటి అపరమేధావికి పుట్టు మేధావుడిగా పుట్టిన నారా లోకేష్. వీరికి వీరి శక్తి ఎలాగూ చాలదు జగన్ ను ఓడించడానికి అనే క్లారిటీ ఉండనే ఉంది. సొంత బలంతో ఏనాడూ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన సీన్ చంద్రబాబుకు లేదు! వాళ్ల కాళ్లూ, వీరి గడ్డాలు పట్టుకుంటే .. ఆటికాటికి మెజారిటీ దక్కితే అదే ఘన విజయం!
అందుకే ఎలాగూ పవన్ కల్యాణ్ ను దత్తపుత్రుడుగా లైన్లో పెట్టి ఉన్నారు! ఆయన కూడా చంద్రబాబు పల్లకి మోయడానికి బోయగా జీవించడానికే తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. ఇలా ఆ తండ్రీకొడుకులకు తోడు ఆ దత్తపుత్రుడు ఉండనే ఉన్నారు!
ఓట్లు చీలనిచ్చేది లేదంటూ , జగన్ ను గద్దెదింపేదే తన జీవిత లక్ష్యమంటూ జనసేనాధిపతి వేయి సార్లు ప్రకటించుకుని ఉంటారు ఇప్పటికే! మరి పచ్చమీడియా చేత అపర చాణుక్యుడిగా సంబోధించబడే చంద్రబాబు నాయుడు, పుట్టు మేధావి నారా లోకేష్, అపర భగత్ సింగ్ పవన్ కల్యాణ్.. మరి వీళ్లు చాలరా? సరిపోరా!
ఏదోగాలికి గెలిచాడని అంటున్నారు కదా జగన్ ని! మరి అలా గాలికి గెలిచి వచ్చిన వారిని ఓడించడానికి వీరి శక్తియుక్తులు సరిపోవడం లేదా! బ్యాక్ గ్రౌండ్ లో రామోజీ, రాధాకృష్ణల మంత్రాంగం సరిపోదా! వీరు గాక ఇంకా కుల మేధావులు, కోవర్టులు, థర్డ్ పార్టీలు, ఇంకా ఎన్నికల వ్యూహకర్తలు, రెండు పెద్ద పత్రికలు, ఇంకో అరడజను టీవీ చానళ్లు! మరి ఇంత సంపన్నమైన బలగం కూడా జగన్ అనే ఒక్కడిని ఓడించడానికి లోకేష్ కు సరిపోవడం లేదా!
ప్రతిపక్ష వాసంలో ఉన్న మరో సారి చంద్రబాబుకు, ఆయన తనయుడికి ఎన్టీఆర్ జూనియర్ గుర్తుకు వచ్చినట్టుగా ఉన్నారు. ఆయనను లోకేషుడు పిలుస్తున్నాడు. కలిసి రావాలని మనసులోని ఆకాంక్షను చాటుకున్నాడు. కలిసి వచ్చి తనను ముఖ్యమంత్రిగా చేయడానికి ఎన్టీఆర్ కూడా ఒక బోయగా మారాలని చంద్రబాబు తనయుడు కోరుకుంటున్నట్టుగా ఉన్నాడు.
ఇప్పటికే పచ్చమీడియా ఒక వైపు, పవన్ కల్యాణ్ ఇంకో వైపు, చంద్రబాబు మరోవైపు మోస్తున్నారు. ఇక తన పల్లకిని నాలుగో వైపు మోయడానికి ఎన్టీఆర్ వస్తే సరిపోతుందని లోకేష్ అనుకుంటున్నాడేమో!