ఏపీలో రాజకీయ విమర్శలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేసుకుంటున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం, సవాళ్లు విసరడం సర్వసాధారణమయ్యాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు… తగ్గేదేలేదంటున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు, లోకేశ్లపై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే టీడీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ మాలోకం మీసం మెలేస్తున్నారని, చంద్రబాబు తొడలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. పట్టాభిలాంటి నాయకులు ఒళ్లు బలిసిన పంది నోటికొచ్చినట్టు మాట్లాడితే కార్యకర్తలు తన్నడానికి ప్రయత్నించారన్నారు. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడినా తన్నటం గ్యారెంటీ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కొట్టుకోడానికి లగ్నం పెట్టుకుందామని చంద్రబాబు సవాల్ విసురుతున్నారని, 23 సీట్లతో మూలన కూచోబెట్టారు చూడు… అదే బట్టలూడదీయడం అని సీదిరి అప్పలరాజు వెటకరించారు. 2024 ఎన్నికల ముహూర్తంలో నువ్వో మేమో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. లోకేశ్ మీసం మెలేసి సవాల్ విసురుతుంటే, బాద్షాలో బ్రహ్మి డైలాగ్లా వుందన్నారు.
సీరియస్ సినిమాలో కమెడియన్ పాత్రలా ఉందన్నారు. లోకేశ్ బాడీ లాంగ్వేజీకి, చెప్పే డైలాగ్కి పొంతన లేదని దెప్పి పొడిచారు. పాదయాత్రలో లోకేశ్ పిచ్చి చేష్టలు, విచిత్ర వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. తలకిందులుగా తపస్సు చేసినా జగన్ ఇమేజ్ను చెరిపేయలేరని అప్పల రాజు అన్నారు.