చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్ వర్సెస్ కొడాలి నాని, వల్లభనేని వంశీ అన్నట్టుగా ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీని రెచ్చగొడుతూ, మరీ తిట్టించుకుంటున్నారేమో అనే చర్చ నడుస్తోంది. వంశీ, నానీలపై టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడ్డం, వాళ్లు అంతకు పదింతలు తిట్టడం చూస్తున్నాం. వీళ్ల మధ్య విమర్శలు హద్దులు దాటి… బూతుల స్థాయికి దిగజారింది.
ఈ నేపథ్యంలో గన్నవరం వెళ్లిన చంద్రబాబు మరోసారి జగన్తో పాటు వైసీపీ నేతల్ని తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. గన్నవరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న వల్లభనేని వంశీ మరోసారి తన మార్క్ రాజకీయ దాడిని చంద్రబాబుపై సాగించారు. చంద్రబాబు తనను పశువుల డాక్టర్గా వెటకార ధోరణిలో విమర్శించడాన్ని వంశీ తప్పు పట్టారు. తిరుపతిలో చంద్రబాబు శిశువుల డాక్టర్ని మోసగించిన కథ చెప్పాలని కొందరు తనను అడుగుతున్నారని వంశీ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఆ కథ చెబితే మళ్లీ బోరుమని చంద్రబాబు ఏడుస్తాడేమో అని ఘాటు వ్యాఖ్య చేయడం గమనార్హం. చంద్రబాబు ఇలాగే తనపై ఎక్కువ మాట్లాడితే శిశువుల డాక్టర్ను మోసగించిన కథ చెప్పాల్సి వుంటుందని వంశీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వంశీ మళ్లీ చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చే అంశాన్ని వెలికి తీసినట్టైంది. గతంలో ఓ సందర్భంలో వల్లభనేని వంశీ తన ప్రియమైన లోకేశ్ గురించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తనను గంట, అరగంట అని వ్యంగ్యంగా అనడంతో మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం చెందారు. చంద్రబాబును ఉద్దేశించి తాను కూడా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో అసెంబ్లీలో తన భార్యను అవమానించారని, తిరిగి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని బాబు బహిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వెక్కివెక్కి ఏడ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది.
తనను అవమానించేలా మాట్లాడితే చంద్రబాబుకు మళ్లీ ఏడ్చే రోజులు తెప్పిస్తామని వంశీ హెచ్చరించడం చర్చనీయాంశమైంది. ఇంతకూ శిశువుల డాక్టర్ని బాబు మోసగించిన కథ ఏంటంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు.