తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను దృష్టిలో పెట్టుకుని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మాగుంట శ్రీనివాస్రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఇరుక్కున్న నేపథ్యంలో, ఆయన కుటుంబాన్ని బాలినేని పరామర్శించారు. మాగుంట ఇంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుమార్తె కవితను ఇరికించేందుకే మాగుంట కుమారుడిని అరెస్ట్ చేశారని పరోక్ష వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం ప్రజలకు ఎంతో సేవ చేసిందన్నారు. అలాంటి కుటుంబంపై రాజకీయ కుట్ర చేయడం బాధాకరమన్నారు. మాగుంట కుటుంబం అందరినీ కలుపుకుని పోయే స్వభావం కలిగి ఉందన్నారు. కేవలం రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఎంపీ కుమారుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరైన చర్య కాదన్నారు.
వేరే వాళ్ల కోసం మాగుంట కుటుంబాన్ని బలి చేస్తున్నారని బాలినేని ఆరోపించారు. అది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. వాళ్ల గురించి మాట్లాడ్డం అనవసరమన్నారు. కోర్టులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. గతంలో జగన్పైన కూడా ఇలాంటి కేసులే పెట్టారన్నారు. నిజమైన కేసులు పెడితే పోరాటం చేయొచ్చన్నారు. ఉద్దేశ పూర్వకంగా కేసులు పెడితే ఎవరూ ఏమీ చేయలేరన్నారు.
మాగుంట కుటుంబానికి జిల్లా ప్రజలతో పాటు పార్టీ అండగా ఉంటుందని బాలినేని అన్నారు. వేరే వాళ్ల కోసమని బాలినేని చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా కేసీఆర్ తనయ కవితను ఉద్దేశించే అని అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ రాజకీయంగా ఆధిపత్యం సాధించేందుకు గట్టిగా కొట్టాడుతున్న సంగతి తెలిసిందే.