యువగళం పేరుతో నారా లోకేశ్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలు పెట్టారు. పాదయాత్రలో తరచూ ఆయన అంటున్న మాట… ‘నేను మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ పిల్లి వణికిపోతోంది. నేను మాట్లాడితే ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారనే భయం. జగన్రెడ్డీ నువ్వు ఎంత అడ్డుకుంటే నేను అంత ఎక్కువగా మాట్లాడ్తా’ అని హెచ్చరిస్తున్నారు. రాజకీయంగా లోకేశ్ విమర్శలను కాసేపు పక్కన పెడదాం.
వాస్తవాలను మాట్లాడుకుందాం. లోకేశ్ హెచ్చరిస్తున్నట్టుగా, ఆయన ప్రసంగానికి సీఎం జగన్, వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడుతున్నారా? అని ప్రశ్నిస్తే… లేదనే సమాధానం వస్తుంది. లోకేశ్ నోరు తెరిస్తే భయపడుతున్నదెవరంటే… మొదట చంద్రబాబు, ఆ తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మొదట్లో లోకేశ్ ప్రసంగం అంటే టీడీపీ వణికిచచ్చేది. మనసులో ఒకటి అనుకుని, దాన్ని డెలవరీ చేసే సమయానికి పూర్తి విరుద్ధమైన అర్థంలో లోకేశ్ మాట్లాడేవారు.
కుల పిచ్చి, మత పిచ్చి ఉన్న పార్టీ ఏదైనా వుందంటే… అది టీడీపీనే అని ఆయన బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేశ్ ప్రసంగం కాస్త మెరుగుపడింది. తప్పులు తగ్గాయి. అంతెందుకు పాదయాత్ర ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ లోకేశ్ నోటి నుంచి రాలిన ఆణిముత్యాలు అంటూ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న కొన్ని పదాల గురించి తెలుసుకుందాం.
ప్రశాంత అత్త (ప్రశాంతత), ఇవగళం (యువగళం), రామ్రావ్ (రామారావు), తెల్గింటి (తెలుగింటి), నాస్నమ్ (నాశనం), ఇస్క (ఇసుక), మద్దెమ్ (మద్యం), నాణెమైన (నాణ్యమైన) ….ఇలా మరికొన్ని పదాల గురించి చెప్పుకోవచ్చు. తాను ప్రసంగిస్తే తాడేపల్లి ప్యాలెస్కు భయమని లోకేశ్ భ్రమల్లో ఉన్నారు. లోకేశ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని టీడీపీ అభిప్రాయం. ఎందుకంటే లోకేశ్ నోరు తెరిస్తే… ఏం బండబూతులు మాట్లాడ్తారో అని టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురి కావడం తెలిసిందే.