బిగ్బాస్ రియాల్టీ షో ఇప్పుడిప్పుడే రక్తి కడుతోంది. కొందరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోంది. ఈ విషయాన్ని కంటెస్టెంట్లు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. హోస్ట్ నాగార్జున సమక్షంలో కంటెస్టెంట్ల మధ్య ప్రేమ సంగతుల గురించి ఆసక్తికర చర్చ జరిగింది. తప్పు చేసిన వారిని బోనులో నిలబెట్టి ప్రశ్నించే టాస్క్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి.
అఖిల్ పడుకున్న తర్వాత మోనాల్, అభితో క్లోజ్గా ఉంటుందని దివి చెప్పింది. దివి మాటలకు అఖిల్, మోనాల్ నొచ్చుకున్నట్టు, వాళ్ల కళ్లలో తిరిగిన నీళ్లు చెప్పాయి. అసలు ఈ చర్చంతా మోనాల్ అమాయకత్వం వల్లే వచ్చింది. అభిజిత్ను బోనులో నిలిపిన మోనాల్ … కొన్ని రోజులుగా తనతో అభి మాట్లాడ్డం లేదని వాపోయింది. దీనికి అభి స్పందిస్తూ తనకు ఓ విషయంలో మోనాల్ వైఖరి నచ్చక దూరంగా ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు.
హోస్ట్ నాగార్జున కలుగజేసుకుంటూ అసలేం జరుగుతోందో చెప్పాలని దివిని ప్రశ్నించాడు. దివి స్పందిస్తూ … స్టోర్ రూంలో అభితో మోనాల్ ముచ్చట్లు పెట్టిందని, ఆ సందర్భంలో ఐ లైక్ యూ అని చెప్పిందని వివరించింది.
ఈ విషయాన్ని తమతో అభి చెప్పినట్టు దివి వివరణ ఇచ్చింది. దివి మాటలపై మోనాల్ రియాక్ట్ అవుతూ… ఆ రోజు బ్యాటరీస్ మార్చుకోడానికి స్టోర్ రూమ్కి వెళ్లానంది. రేషన్ మేనేజర్గా అభి ఉండటం వల్ల అతనితో మాట్లాడాల్సి వచ్చిందని, పర్సనల్గా అతను ఇష్టం ఉండడం వల్ల ఐ లైక్ యూ అని చెప్పినట్టు మోనాల్ స్పష్టత ఇచ్చింది.
ఇక అవినాష్ -అరియానా మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ జరుగుతోందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగేలా నాగార్జున ఓ చిన్న సీన్ను ఆసక్తికరంగా క్రియేట్ చేశాడు. సోపా మీద ఏదో రాశావని, అది చదివి అరియానా హగ్ కూడా ఇచ్చిందని, ఇంతకూ ఏం రాశావో అందరికీ తెలిసేలా చెప్పాలని నాగార్జున …అవినాష్ను గట్టిగా నిలదీశాడు.
దీంతో అవినాష్ స్పందిస్తూ నిజంగానే తనకేమీ గుర్తు రావడం లేదని అమాయకత్వాన్ని ప్రదర్శించాడు. ఇదే విషయమై అరియానాను నాగార్జున ప్రశ్నించగా ….ఆ అమ్మాయి కూడా అంతే అమాయకంగా తనకేమీ గుర్తు రావడం లేదని చెప్పుకొచ్చింది.
ఈ తతంగం అలా సాగుతుండగా లాస్య జోక్యం చేసుకుంటూ వాళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. “అమ్మా తల్లి అంత ఏమీ లేదని” అరియానా సమాధానమిచ్చింది. కాసేపటికి అరియానా తనకు గుర్తు వచ్చిందంటూ నువ్వు అందంగా ఉంటావని చేతిపై రాసినట్టు చెప్పుకొచ్చింది.
కానీ నాగార్జున మాత్రం సోపా మీద ఏమి రాశావో చెబుతావా లేక వీడియో ప్లే చేయాలా అని గట్టిగా అడగడంతో … వద్దు సార్ అని అవినాష్, అరియానా వేడుకోవడం వాళ్ల మధ్య సంబంధాలపై కంటెస్టెంట్లతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా అనుమానం బలపడింది.
సర్ పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఇలా అని తెలిస్తే ఎవరు పిల్లని కూడా ఇవ్వరని అవినాష్ అనడంతో అందరూ గొల్లుమని నవ్వారు. ఐ లవ్ యూ అని రాశావని నాగార్జున చెప్పడంతో ….అది నిజం కానే కాదని అవినాష్, అరియానా గట్టిగా వాదించారు.
చివరికి ఉత్కంఠకు తెరదించుతూ కూల్ అని రాశావని నాగార్జున చెప్పడంతో … ఔను సార్ అంటూ అరియానా- అవినాష్ ముక్తకంఠంతో పలికారు. మొత్తానికి ఎవరెవరి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో ఈ ఎపిసోడ్లో కొంత వరకు స్పష్టత వచ్చింది.