అమరావతిలో ఎవరెవరికి ఎన్ని ఎకరాలున్నాయి..?

ఏపీ నూతన రాజధాని పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని అరాచకాలకు పాల్పడిందీ, ఎన్ని అక్రమాలు చేసిందీ.. అంతా అసెంబ్లీలో చిట్టా విప్పారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. సమావేశాల చివరి…

ఏపీ నూతన రాజధాని పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని అరాచకాలకు పాల్పడిందీ, ఎన్ని అక్రమాలు చేసిందీ.. అంతా అసెంబ్లీలో చిట్టా విప్పారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. సమావేశాల చివరి రోజు ప్రత్యేకంగా అమరావతి అంశంపై చంద్రబాబు అవినీతి చిట్టా విప్పే కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్నారు వైసీపీ నేతలు. సాక్ష్యాధారాలతో సహా సభకు వచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గన.. డీటెయిల్డ్ గా టీడీపీ మోసాన్ని బైటపెట్టారు.

గ్రాఫిక్స్ వీడియోని టెలికాస్ట్ చేస్తూ హెరిటేజ్ కి ఎక్కడ స్థలం ఉందో చూపించారు. మొత్తం 4070 ఎకరాలను టీడీపీ నాయకులు, వారి అనుయాయులు ముందే కొనిపెట్టుకున్నారని చెప్పారు. అప్పటి మంత్రి నారాయణ తన సంస్థలో పనిచేసే ఉద్యోగుల పేరుతో 55.27 ఎకరాలు కొన్నారని, ఆధారాలు లేని స్థలాలు వీరికి చాలానే ఉన్నాయని చెప్పారు.

పరిటాల సునీత తన అల్లుడి పేరుతో, యనమల రామకృష్ణుడు తన అల్లుడి పేరుతో కొన్న ఆస్తుల వివరాలు కూడా బైటపెట్టారు బుగ్గన.

ఇక నారా లోకేష్ పేరుని అడ్డం పెట్టుకుని ఎంతమంది ఎన్ని ఎకరాలను సమకూర్చుకుందీ సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ఉదయం అసెంబ్లీ నుంచి వాకవుట్ చేసి, తిరిగి సభకు వచ్చిన చంద్రబాబు అండ్ కో.. బుగ్గన ప్రజెంటేషన్ చూసి అవాక్కయింది. అవి తమ భూములు కావు అని చెప్పే దమ్ములేదు, అలాగని తమ గుట్టంతా రట్టవుతుంటే చూస్తూ ఊరుకోనూ లేరు. అసలు వాకవుట్ చేసి తిరిగి సభలోకి ఎందుకొచ్చామా అంటూ తలలు పట్టుకున్నారు టీడీపీ నేతలు.

బుగ్గన ప్రసంగం ఆసాంతం చంద్రబాబు మొహంలో రక్తపు చుక్క లేదంటే పరిస్ధితి అర్థం చేసుకోవచ్చు. శివరామ కృష్ణన్ కమిటీ రిపోర్ట్ ని సైతం పక్కనపెట్టి, ఓ ప్లాన్ ప్రకారమే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టారని, ఇక్కడ రాజధాని కట్టాలంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేశారని అది కూడా ఫోన్లో జరిగిందని ఎద్దేవా చేశారు బుగ్గన.

పూర్తిగా వ్యాపారస్తులతో నారాయణ కమిటీ ఏర్పాటు చేసి దాని ప్రకారం రాజధానిని నిర్ణయించి రాష్ట్ర భవిష్యత్తుని అంధకారంలో పడేశారని విమర్శించారు. టీడీపీ నేతలంతా చౌకగా భూములు కొన్న తర్వాత రేట్లు పెంచేసుకున్నారని భూదందాని కళ్లకు కట్టినట్టు వివరించారు. ఆ తర్వాత జగన్ రాజధాని అంశంపై మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున స్పష్టమైన ప్రకటన చేశారు.