రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబునాయుడికి సరైన సౌకర్యాలు లేవని టీడీపీ గగ్గోలు పెడుతోంది. బాబుతో ములాఖత్ అయిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జైల్లో సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్ సరిగా తిరగడం లేదని, దీంతో బాబును దోమలు చుట్టుముట్టి హింసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీ సౌకర్యం కల్పించాలని జైలు అధికారులకు విన్నవించినట్టు ఆయన చెప్పారు.
యనమల కామెంట్స్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్స్ పేలుతున్నాయి. వైఎస్ జగన్ పార్టీ వైసీపీ గుర్తు ఫ్యాన్. దీంతో వైసీపీపై కోపంతో చంద్రబాబు జైల్లో ఫ్యాన్ వేసుకోవడం లేదని, అందుకే ఆయన్ను దోమలు వెంటాడుతున్నాయంటూ నెటిజన్లు వ్యంగ్య పోస్టులు పెడుతున్నారు. వైసీపీపై కోపంతో చంద్రబాబు కోరి కష్టాలు తెచ్చుకున్నారని, దీనికి ఆయనే బాధ్యుడంటూ వెటకరిస్తున్నారు.
దోమలపై దాడికి సంబంధించిన ప్రాజెక్టు సొమ్మును చంద్రబాబు దిగమింగారని, దీంతో ఫాగింగ్ మందు కొనుగోలుకు కూడా నిధులు లేవంటూ నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. జైల్లో తనకు సౌకర్యాల కల్పనపై చంద్రబాబు ఏమీ మాట్లాడ్డం లేదని, ఆయన్ను కలిసిన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతల ఓవరాక్షన్తో ఆయన అభాసుపాలవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు చంద్రబాబు అత్తగారింటికి వెళ్లినట్టుగా సౌకర్యాలపై ఎల్లో మీడియా వికృత రాతలు రాస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి వైసీపీ గుర్తు ఫ్యాన్ కావడం వల్లే బాబు దానికి దూరంగా వుంటున్నారనే వెటకారం ప్రత్యర్థుల నుంచి ఎదుర్కోవాల్సి వస్తోంది. రాజకీయాల్లో కాదేదీ విమర్శలకు అనర్హమనే రీతిలో టీడీపీ, వైసీపీ పరస్పరం దూషించుకుంటున్నాయి.