టాలీవుడ్ హీరో నవదీప్ హైకోర్టులో ఎదురు దెబ్బ తిన్నారు. డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ నుంచి తప్పించుకోవాలనే ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో నవదీప్ అరెస్ట్ అయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ 37వ నిందితుడు. రామ్చంద్ అనే మిత్రుడి నుంచి డ్రగ్స్ పొందినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇప్పటికే నవదీప్ మిత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక నవదీప్ వంతు వచ్చిందనే ప్రచారం తెరపైకి వచ్చింది. డ్రగ్స్తో నవదీప్కు సంబంధాలున్నాయని, ఆయన పరారీలో ఉన్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. తాను పరారీలో లేనని, హైదరాబాద్లోనే ఉన్నానని నవదీప్ ప్రకటించారు. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో నవదీప్ హైకోర్టును ఆశ్రయించి సానుకూలంగా ఉత్తర్వులు పొందారు. ఆ గడువు ముగిసింది.
మరోసారి ఉపశమనం కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. నవదీప్ వేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. నవదీప్ను విచారించాల్సిన అవసరం ఉందని, అతనికి డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయన్న నార్కోటిక్ పోలీసులు వాదనతో తెలంగాణ హైకోర్టు ఏకీభవించింది. నవదీప్ బెయిల్ ఆశలు గల్లంతయ్యాయి. అతనికి గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టైంది. దీంతో నవదీప్ అరెస్ట్పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.