అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబునాయుడికి మద్దతు కూడగట్టేందుకు టీడీపీ శ్రమిస్తోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి మద్దతును ఆ పార్టీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు దివంగత సూపర్స్టార్ కృష్ణ తమ్ముడు , నిర్మాత ఆదిశేషగిరిరావు మద్దతుగా నిలవడం విశేషం. గతంలో ఈయన వైసీపీలో ఉన్నారు.
గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరారు. ఆ తర్వాత రాజకీయంగా మౌనంగా వుంటూ వచ్చారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాల నేపథ్యంలో ఆదిశేషగిరిరావు తెరపైకి రావడం గమనార్హం. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఆయన పరామర్శించారు. కష్టకాలంలో ఉన్న బాబు కుటుంబానికి ఆయన మద్దతు పలికారు.
ఆదిశేషగిరిరావు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో కొత్త తరహా రాజకీయాలు చూస్తున్నట్టు చెప్పుకొచ్చారు. విద్వేష రాజకీయాలు మంచిది కాదన్నారు.
గతంలో చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డిల పరిపాలనను చూశానన్నారు. ముఖ్యమంత్రులుగా వాళ్లిద్దరి వ్యవహార శైలుల్ని గమనించానన్నారు. వాళ్లిద్దరూ ఎప్పుడూ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడలేదన్నారు. జగన్ పాలనలో అలాంటివి చూస్తున్నానన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు.