వైఎస్ జగన్, నారా చంద్రబాబునాయుడు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అయితే చంద్రబాబునాయుడిలా వైఎస్ జగన్ ఏనాడూ ఏడ్వలేదు. జగన్ కోసం నాడు వైసీపీ డ్రామాలకు తెరలేపలేదు. జగన్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఎవరూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేయలేదు. కేసులను నాడు వైఎస్ జగన్ ఒంటరిగానే ఎదుర్కొన్నారు. వ్యవస్థలతో పోరాడే క్రమంలో మరింత రాటుదేలారు. అదే నేడు జగన్కు రాజకీయంగా ఎంతో ఉపయోగపడుతోంది.
మరి నేడు చంద్రబాబునాయుడి పరిస్థితి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అవినీతికి పాల్పడ్డారనే కారణంతో చంద్రబాబును ఏపీ సీఐడీ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. ఏసీబీ కోర్టు రిమాండ్కు ఆదేశించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక అప్పటి నుంచి నాటకానికి టీడీపీ తెరలేపింది.
చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ మొత్తం ప్రపంచమంతా రోడ్డుపైకి వస్తోందన్న వాతావరణాన్ని తమ అనుకూల మీడియాను అడ్డు పెట్టుకుని సృష్టించేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలలో సాప్ట్వేర్ ఇంజనీర్లు రోడ్డుపైకి వచ్చి నిరసనకు దిగారంటూ ప్రచారం చేస్తోంది. వీళ్లంతా టీడీపీ అభిమానులని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే నారా భువనేశ్వరి, బ్రాహ్మణి నేతృత్వంలో విజయవాడలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీకి టీడీపీ మహిళలు, వృద్ధులను ఆ పార్టీ నేతలు సమీకరించారు.
ఇక టీడీపీ తోక పార్టీలైన సీపీఐ, సీపీఎం, జనసేన అత్యుత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వామపక్షాలు సిద్ధాంతాలను వదిలేసి చంద్రబాబుతో అంటకాగడం చాలా ఏళ్లైంది. చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్న పార్టీల్లో ఒక్క వైసీపీ మినహా బీజేపీతో సహా అన్ని పార్టీలున్నట్టు ఎల్లో మీడియా చెబుతోంది. ఇక మావోయిస్టుల మద్దతు ఒక్కటే తక్కువైంది. అవసరమైతే మావోయిస్టుల పేరుతో టీడీపీనే ఒక ప్రకటన ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఎందుకంటే చంద్రబాబు పుట్టించిన టీడీపీ అనుబంధ ప్రజాసంఘాలు ఏపీలో చాలానే ఉన్నాయి. ఇప్పుడా సంఘాలు ప్రతి రోజూ ఏదో ఒక చోట వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తుండడం చూస్తున్నాం. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఏంటి సంబంధమని వీరే ప్రశ్నిస్తున్నారు. ఈ మేథావులెవరూ నాడు వైఎస్ జగన్ను అరెస్ట్ చేస్తే ప్రశ్నించిన దాఖలాలు లేవు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామి కాని వైఎస్ జగన్పై సీబీఐ ఎలా కేసు పెడుతుంది? ఎందుకు అరెస్ట్ చేస్తుందని అఖిలపక్ష సమావేశాలు పెట్టి వామపక్షాలు ప్రశ్నించలేదు.
ప్రతిరోజూ పేపర్లలో జగన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని మాట్లాడిన వాళ్లు లేరు. జగన్కు మద్దతు కూడగట్టే ప్రయత్నం నాడు వైసీపీ చేయలేదు. ఎందుకంటే అప్పట్లో జగన్ ఇప్పుడంత బలమైన నాయకుడు కాదు. జగన్ అరెస్ట్ను నిరసిస్తూ నాడు ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే రోడ్డెక్కారు. తనపై నమోదైన కేసులను న్యాయస్థానంలోనే జగన్ నేటికీ ఎదుర్కొంటున్నారు. కేసులకు భయపడి చంద్రబాబులా జగన్ గుక్కపెట్టి ఏడ్వలేదు. ఇతరులపై నిందలు వేయలేదు.
జగన్పై కేసులను అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రాస్తున్నా దీటుగా ఎదుర్కొంటున్నారు. ఒకవైపు చంద్రబాబు కేసులపై న్యాయ స్థానంలో విచారణ జరుగుతుండగా, మరోవైపు ఎల్లో మీడియా, టీడీపీ తమ ఆరాధ్య నాయకుడు నిర్దోషి అంటూ తీర్పులు ఇవ్వడం చూస్తున్నాం. అసలు చంద్రబాబు అనే నాయకుడు అవినీతికి పాల్పడినా ఆయనపై కేసులు పెట్టడం ఏంటనే వితండ వాదానికి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నిజానిజాలతో సంబంధం లేకుండా మెజార్టీ మీడియాతో చేతల్లో వుంది కదా అని అడ్డగోలు వాదనల్ని తెరపైకి తేవడాన్ని గమనించొచ్చు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైబడి రాజకీయ చరిత్ర కలిగి, ఎన్నో అడ్డగోలు పనులు చేస్తూ, చట్టం కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబును ఆటకట్టించే ఒక్క మగాడు జగన్ వచ్చాడని జనం అనుకుంటున్నారు. ఇప్పుడు కాకపోతే, మరెప్పటికీ బాబుకు ఇలా శిక్ష వేయగలిగే పాలకుడు రారు, రాలేరనే చర్చకు తెరలేచింది. బాబు దోషా? నిర్దోషా? అనేది న్యాయ స్థానం తేలుస్తుంది. ఇంకా బాబు నిప్పు, ఆయన కొడుకు పప్పు లాంటి వాదనలకు స్వస్తి చెప్పి, న్యాయ పోరాటానికి పరిమితమైతే గౌరవంగా వుంటుంది. లేదంటే చంద్రబాబు మరింతగా అభాసుపాలు కావడం ఖాయం.