భార్యాభర్తలుగా మారిన కియరా అద్వానీ, సిద్దార్థ్

బాలీవుడ్ లో మరో జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ కియరా అద్వానీ, హీరో సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకున్నారు. జైసల్మేర్ లోని సూర్యగఢ్ ఫైవ్ స్టార్ హోటల్ రిసార్ట్ లో వీళ్ల పెళ్లి…

బాలీవుడ్ లో మరో జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ కియరా అద్వానీ, హీరో సిద్దార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకున్నారు. జైసల్మేర్ లోని సూర్యగఢ్ ఫైవ్ స్టార్ హోటల్ రిసార్ట్ లో వీళ్ల పెళ్లి ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది.

షేర్షా సినిమా టైమ్ లో కలుసుకున్నారు కియరా-సిద్దార్థ్. అప్పట్నుంచి ఇద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైమ్ కే వాళ్ల డేటింగ్ వ్యవహారం బయటకొచ్చింది. అప్పట్నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట, ఇన్నాళ్లకు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.

జైసల్మేర్ లో 3 రోజుల పాటు వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొద్దిమంది బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఈ వెడ్డింగ్ జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో కియరాను వివాహమాడాడు సిద్దార్థ్ మల్హోత్రా.

పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఖరీదైన రూమ్స్ బుక్ చేసింది ఈ జంట. ఎయిర్ పోర్ట్ నుంచి వాళ్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చేందుకు లగ్జరీ కార్లు ఏర్పాటుచేసింది. ప్రతి రోజూ వందల వెరైటీల్ని వడ్డించింది. అయితే పెళ్లి వేదిక దగ్గరకు మాత్రం ఎవ్వర్నీ ఫోన్లతో అనుమతించలేదు. అందరూ తమకు కేటాయించిన గదుల్లో సెల్ ఫోన్లు వదిలేసి పెళ్లికి వచ్చారు.

ఈరోజు రాత్రి హోటల్ లోనే భారీ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. 12వ తేదీన ముంబయిలో ఓ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో కూడా మరో రిసెప్షన్ ఏర్పాటు చేసింది ఈ జంట. అందరు హీరోయిన్లలానే కియరా కూడా పెళ్లి తర్వాత సినిమాలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోంది.