పోలవరం పై చంద్రబాబు మరో ఘన కార్యమిది!

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్లకు అప్పటి ప్రభుత్వం 2346 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించినట్లు జల శక్తి మంత్రి రతన్‌ లాల్‌ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి…

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌ కాంట్రాక్టర్లకు అప్పటి ప్రభుత్వం 2346 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించినట్లు జల శక్తి మంత్రి రతన్‌ లాల్‌ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపుల వ్యవహారంపై నియమించిన నిపుణుల సంఘం దీనిపై విచారణ జరిపి జూలై 2019లో నివేదికను కేంద్ర జల సంఘానికి తెలిపినట్లు ఆయన చెప్పారు.

ఈ నివేదిక ప్రకారం 2015-16 సంవత్సరంలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివిధ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందాల పునఃపరిశీలన జరిపి కాంట్రాక్టర్లకు అదనంగా 1331 కోట్లు చెల్లించింది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లపై వడ్డీ కింద 84.43 కోట్లు, అడ్వాన్స్ కింద 144.22 కోట్లు, జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ పనులు అప్పగించడానికి ముందుగానే సంబంధిత కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్‌ కింద 787 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లుగా నిపుణుల కమిటీ నివేదిక పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు.

అయితే అదనపు చెల్లింపులపై నిపుణుల సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రాధమికమైనవని గత నవంబర్‌ 11న రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖలో స్పష్టం చేసినట్లు చెప్పారు. పైన తెలిపిన నిర్ణయాలలో విధానపరమైన అతిక్రమలు లేవని, సంబంధిత అధికారుల ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఈ అదనపు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విచారణ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం జరుగుతుందని చెప్పారు. 

బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌ల జాబితాలో రిషికొండ
విశాఖపట్నంలోని రిషికొండ బీచ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఏర్పడింది. దేశంలో బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ కోసం ఎంపిక చేసిన 13 పైలట్‌ బీచ్‌ల జాబితాలో రిషికొండ కూడా ఉన్నట్లు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సిప్రియో వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ దేశంలోని కొన్ని ఎంపిక చేసిన బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ సాధించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు.

అంతర్జాతీయ ఏజెన్సీ అయిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌, డెన్మార్క్‌ సంస్థ అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ను జారీ చేస్తుందని చెప్పారు. బీచ్‌లో స్నానానికి వినియోగించే నీళ్ళ నాణ్యత, బీచ్‌లో పర్యావరణ యాజమాన్యం, రక్షణ కోసం చేపట్టే చర్యల వంటివి ప్రధానమైన అంశాలని చెప్పారు. బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌ ఇకో టూరిజం మోడల్‌లో ఉంటుంది. పరిశుభ్రమైన పరిసరాలు, స్వచ్ఛమైన నీరు, సకల సౌకర్యాలు, ఆరోగ్యవంతమైన పర్యావరణం బీచ్‌ సందర్శకులకు కల్పించడం బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.